గాలి జగదీశ్ ను పార్టీలో చేర్చుకోవాలనుకుంటున్న హైకమాండ్
అమరావతి: వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో తాడేపల్లిలోని ఆయన నివాసంలో మాజీ మంత్రి ఆర్కే రోజా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల కాలంలో నగరి నియోజకవర్గంలో నెలకొన్న తాజా పరిణామాలపై ప్రధానంగా చర్చ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా, గాలి ముద్దు కృష్ణమ నాయుడు రెండవ కుమారుడు గాలి జగదీష్ ప్రకాష్ ను వైసీపీలోకి చేర్చుకునేందుకు సన్నాహాలు చేసిన పార్టీ అధిష్టానం.

అతడి చేరికకు బ్రేక్
అయితే, గాలి జగదీష్ ప్రకాష్ ను వైసీపీలో చేర్చుకోవడాన్ని మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటంతో అతడి చేరికకు బ్రేక్ పడింది. ఇక, ఈరోజు అదే అంశంపై రోజాతో మాజీ సీఎం వైఎస్ జగన్ చర్చించినట్లు సమాచారం. ఈ భేటీలో గాలి జగదీష్ ప్రకాష్ చేరికపై కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో నగరి నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో తాజాగా నెలకొన్న పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి.
రోజా తీవ్ర అభ్యంతరం
కాగా, దివంగత గాలి ముద్దుకృష్ణమ నాయుడి రెండో కుమారుడు, నగరి నేత గాలి జగదీశ్ ను పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ అధిష్ఠానం సిద్ధమయిందనే వార్తలు కొన్ని రోజులుగా వస్తున్న విషయం తెలిసిందే. తొలుత వచ్చిన వార్తల ప్రకారం ఇప్పటికే వైసీపీలో జగదీశ్ చేరాల్సి ఉంది. అయితే, రోజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన చేరికకు బ్రేక్ పడిందని చెపుతున్నారు. ఈ నేపథ్యంలో, ఈ అంశంపై రోజాతో జగన్ చర్చించినట్టు సమాచారం.