ఎమ్మెల్యేల ఆర్థిక, నేర, రాజకీయ నేపథ్యానికి సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఇటీవల ఓ విశ్లేషణను విడుదల చేసింది. ఇందులో దేశంలోని అత్యంత సంపన్న ఎమ్మెల్యేలు ఎవరూ, అత్యంత పేద ఎమ్మెల్యేలు ఎవరూ అనే వివరాలను వెల్లడించింది. ఈ జాబితాలో అగ్రస్థానంలో మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత పరాగ్ షా నిలవగా, అతి పేద ఎమ్మెల్యేగా పశ్చిమ బెంగాల్కు చెందిన బీజేపీ నేత నిర్మల్ కుమార్ ధారా గుర్తింపు పొందారు. అంతేకాదు, ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు టాప్ 20లో చోటు దక్కించుకున్నారు. ఇందులో ఎక్కువ మంది తెలుగువారే ఉండడం విశేషం. మరి వీరు ఎవరెవరు? ఏపీ నుంచి ఎంత మంది? తెలంగాణ నుంచి ఎంత మంది? ఎవరి వద్ద ఎంత ఆస్తులున్నాయి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

భారతదేశంలో అత్యంత ధనిక ఎమ్మెల్యేలు
ADR విడుదల చేసిన నివేదిక ప్రకారం, దేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత పరాగ్ షా నిలిచారు. ఆయన వద్ద రూ. 3400 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. అదే సమయంలో అత్యంత పేద ఎమ్మెల్యేగా పశ్చిమ బెంగాల్కు చెందిన బీజేపీ నేత నిర్మల్ కుమార్ ధారా గుర్తింపు పొందారు. ఆయన ఆస్తుల మొత్తం విలువ కేవలం రూ. 1700 మాత్రమే కావడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనిక ఎమ్మెల్యేలు
ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు టాప్ 20లో స్థానం దక్కించుకోవడం విశేషం. ముఖ్యంగా టాప్ 10లో ఏపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు చోటు దక్కించుకున్నారు.
టాప్-10లో ఏపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు:
టాప్-5: ఎన్. చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి, టీడీపీ) – రూ. 931 కోట్లు
టాప్-6: పి. నారాయణ (టీడీపీ ఎమ్మెల్యే) – రూ. 824 కోట్లు
టాప్-7: వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి (మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ) – రూ. 757 కోట్లు
టాప్-8: వి. ప్రశాంతి రెడ్డి (టీడీపీ ఎమ్మెల్యే) – రూ. 716 కోట్లు
టాప్-20లో ఏపీకి చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలు:
టాప్-12: నారా లోకేష్ (టీడీపీ ఎమ్మెల్యే) – రూ. 542 కోట్లు
టాప్-16: ఎన్. బాలకృష్ణ (టీడీపీ ఎమ్మెల్యే) – రూ. 295 కోట్లు
టాప్-18: లోకం నాగ మాధవి (జనసేన ఎమ్మెల్యే) – రూ. 291 కోట్లు
తెలంగాణ నుంచి అత్యంత సంపన్న ఎమ్మెల్యేలు
టాప్-20 జాబితాలో తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా స్థానం దక్కించుకున్నారు.
టాప్-11: జీ. వివేకానంద (కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే) – రూ. 606 కోట్లు
టాప్-15: కే. రాజగోపాల్ రెడ్డి (కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే) – రూ. 458 కోట్లు
టాప్-19: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే) – రూ. 433 కోట్లు .ఈ నివేదిక రాజకీయ రంగంలో ఆర్థిక శక్తిని సూచించే విధంగా ఉంది. తెలుగురాష్ట్రాల నేతలు భారీ స్థాయిలో ఆస్తులు కలిగి ఉండడం, అధిక సంఖ్యలో ధనిక ఎమ్మెల్యేలుగా గుర్తింపు పొందడం ఆసక్తికర విషయమే.