ఆంధ్రకు నీళ్ళు ఉంటే చాలు అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు ఇవ్వని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ నీళ్లు వాడుకుంటున్నా స్పందించడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. రాష్ట్రానికి నీళ్ళు లేకున్నా ఆంధ్రకు నీళ్ళు ఉంటే చాలు అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? అని నిలదీశారు. తెలంగాణ నుంచి ఏపీకి అక్కడి ప్రభుత్వం అక్రమంగా నీళ్ళు తీసుకపోతుంటే రేవంత్ తమాషా చూసుకుంట కూర్చున్నారని మండిపడ్డారు.

ఇక మిగిలింది 9 టీఎంసీలు మాత్రమే
ఏపీ 666 టీఎంసీల నీళ్ళు మాత్రమే వాడుకోవాలి.కానీ, ఇప్పటికే 657 టీఎంసీల నీళ్ళను వాడుకుంది. ఇక మిగిలింది 9 టీఎంసీలు మాత్రమే. కానీ, గురువారం కూడా అక్రమంగా నీళ్ళు ఏపీకి వెళ్తున్నాయని.. తెలంగాణకు 343 టీఎంసీల నీళ్ళు రావాలి. కానీ వాడుకున్నది కేవలం 220 టీఎంసీలు మాత్రమే. తెలంగాణకు 123, ఆంధ్రాకు 9 టీఎంసీల నీళ్ళు మొత్తం కలిపి 132 టీఎంసీలు కావాలి. కానీ నాగార్జునసాగర్, శ్రీశైలంలో కలిపి 100 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని..దీనిలో నుంచి ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తోంది. అలాంటప్పుడు రాష్ట్రానికి కావాల్సిన నీళ్ళు ఎక్కడి నుండి తెస్తావ్ అని సీఎం రేవంత్ను హరీష్ రావు విమర్శించారు.
పార్లమెంట్లో తెలంగాణ గొంతు మూగబోయింది
కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి. కేఆర్ఎంబీ కార్యాలయం ముందు ధర్నా చేయండి మేము వస్తాము. కేంద్ర జల్ శక్తి ఆఫీసు ముందు,ప్రధాన మంత్రి ఆఫీసు ముందు ధర్నా చేద్దాం పదండి మీకు చేతకాక పోతే ధర్నాకు మేము వస్తాము. కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకువెళ్ళండి. సాగర్ నీళ్లను ఏపీకి తరలించడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవాలి. శిష్యుడు తెలంగాణ సీఎంగా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు నీళ్లను తరలిస్తున్నారు. పార్లమెంట్లో తెలంగాణ గొంతు మూగబోయింది. తెలంగాణ నీళ్లు తరలిస్తుంటే కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మాట్లాడటం లేదు అని హరీష్ రావు ప్రశ్నించారు.