పార్టీ గీత దాటితే ఊరుకునేది లేద
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేలకు హెచ్చరిక జారీ చేశారు. పార్టీ గీత దాటితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. శంషాబాద్ నోవాటెల్ హోటల్లో జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్సీ) సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీకి ఇబ్బంది కలిగించాలని ఎవరైనా చూస్తే వారే ఇబ్బంది పడతారని అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ అని గుర్తించాలని హితవు పలికారు. మంత్రి వర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని అన్నారు. ఈ విషయంలో ఎవరేమి మాట్లాడినా ఉపయోగం ఉండవని స్పష్టం చేశారు. నిన్న ఉన్నటి వరకు మనపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ విమర్శలు చేసేవారని, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా రంగంలోకి దిగారని అన్నారు.తెలంగాణ పథకాలతో మోదీ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోందని వ్యాఖ్యానించారు. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు తమ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందని సీఎం పేర్కొన్నారు. సన్నబియ్యం పథకం ఒక అద్భుతమని, ఆనాడు రూ.2 కిలో బియ్యంలా ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుండే పథకమని సీఎం వివరించారు. భూ భారతిని రైతులకు చేరవేయాలన్నారు. దేశంలోనే ఇందిరమ్మ ఇండ్ల పథకం ఆదర్శంగా నిలిచిందని, క్షేత్ర స్థాయిలో నిజమైన లబ్ధిదారులకే అందాలని, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.కులగణన ద్వారా వందేళ్ల సమస్యను శాశ్వతంగా పకడ్బందీగా పరిష్కరించామన్న సీఎం, విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బిల్లులు తీసుకొచ్చామని, ఇది ప్రభుత్వ పారదర్శక పాలనకు నిదర్శనమని వెల్లడించారు. జటిలమైన ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని, అందుకే వర్గీకరణ జరిగే వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని తెలిపారు.

హెచ్సీయూ భూములపై ప్రతిపక్షం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో ఒక అబద్ధపు ప్రచారం చేసిందని, ఈ ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కూడా నమ్మి బుల్డోజర్లు పంపిస్తున్నారని మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. పార్టీ, ప్రభుత్వం ప్రతిష్ఠ పెరిగితేనే భవిష్యత్ ఉంటుందని, మనం ఎంత మంచి చేసినా ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ప్రయోజనం ఉండదన్నారు. మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వివరించారు.మీ నియోజకవర్గంలో ఏం కావాలో ఒక నివేదిక తయారు చేసుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆ పనులను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. వర్గీకరణ మోదీకి గుదిబండగా మారిందని, కులగణన మోడీకి మరణశాసనం రాయబోతోందన్నారు. దేశంలో తెలంగాణ మోడల్పై చర్చ జరుగుతోందని తెలిపారు. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టాలనే బీజేపీ, బీఆరెస్ ఒక్కటయ్యాయన్నారు. సన్న బియ్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. సన్న బియ్యం మన పథకం, మన పేటెంట్, మన బ్రాండ్ అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. మనం తీసుకున్న గొప్ప నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.బుధవారం నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రతీ గ్రామం పర్యటించేలా కార్యాచరణ తీసుకోవాలని సూచించారు. తాను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకం అవడానికే సమయం కేటాయిస్తానని చెప్పారు.
చామల కిరణ్ కుమార్ రెడ్డికి స్వీట్ వార్నింగ్
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సీరియస్ అయ్యారు. రోజుకొకరిని మంత్రిగా నువ్వే ప్రకటిస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మంత్రులుగా ఎవరిని ఎంపిక చేయాలనేది హైకమాండ్ చూసుకుంటుంది. మరోసారి ఈ అంశంపై మాట్లాడొద్దు. నేతలు, కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేయొద్దని ఎంపీ చామలకు సిఎం రేవంత్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మనందరి లక్ష్యం ఒక్కటే అయి ఉండాలి. రెండోసారి ప్రభుత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.సన్నబియ్యం పంపిణీ విషయంలో ప్రభుత్వానికి చాలా మంచి పేరు వచ్చింది. దాన్ని పక్కదారి పట్టించడానికి బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. దీన్ని అందరూ సమర్థవంతంగా తిప్పికొట్టాలని చెప్పారు. త్వరలోనే ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ ఇస్తా, రెండోసారి గెలవడానికి మీ నియోజకవర్గాల్లో ప్రభావితం చేసే పనులు తీసుకురండీ, దగ్గరుండీ నేనే చేయిస్తా అని సిఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు.
వివేక్, రాజగోపాలరెడ్డి, ప్రేమ్ సాగర్రావు గైర్హాజరు
సిఎల్పీ సమావేశానికి టిపిసిసి అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క హాజరై ప్రసంగించారు. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై అసంతృప్తితో ఉన్న గడ్డం వివేక్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, ప్రేమ్ సాగర్రావు సిఎల్పీ సమావేశానికి గైర్హాజరయ్యారు. పార్టీ ఫిరాయింపుల ఎదుర్కొంటున్న కడియం శ్రీహరి, సంజయ్, తెల్లా వెంకట్రావు తదితరులు హాజరయ్యారు.
Read more :
Murder: వృద్ధురాలిని చంపి ఆపై పైశాచిక ఆనందాన్ని పొందిన బాలుడు