హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలోని కంచ భూముల వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.తాజాగా సీఎం రేవంత్ రెడ్డి దీనిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.భూముల్లో చెట్లు నరికి వేయడంపై,వన్యప్రాణులు ప్రాణభయంతో పారిపోతున్నాయని ఆరోపణల నేపథ్యంలో ఈ సమీక్ష జరిగింది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రూపొందించిన కొన్ని ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.వన్యప్రాణులు అల్లకల్లోలం అవుతున్నట్టు చూపిస్తూ ప్రజల్లో భయాందోళనలు కలిగించాయి.ఈ వ్యవహారాన్ని సీఎం ఎంతో సీరియస్గా తీసుకున్నారు.ఇలాంటి ఫేక్ కంటెంట్ సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.వాస్తవాలు ప్రజల ముందుకు రావాలంటే విచారణ అనివార్యమని సీఎం అభిప్రాయపడ్డారు.అందుకోసమే కోర్టును ఆశ్రయించాలని సూచించారు.

ఈ వీడియోలు ఉద్దేశపూర్వకంగా సృష్టించబడ్డాయన్న అనుమానంపై విచారణ జరిపించాలని ఆదేశించారు.గచ్చిబౌలి ప్రాంతంలో గత 25 ఏళ్లలో ఎన్నో నిర్మాణాలు జరిగినప్పటికీ.ఎప్పుడూ వన్యప్రాణులపై ఇలాంటి ఆరోపణలు రాలేదని అధికారులు గుర్తు చేశారు.ఇప్పుడొచ్చిన వీడియోలు అసత్య సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికే సృష్టించబడ్డవని తెలిపారు.ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకూడదన్న దృక్పథంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని స్పష్టం చేశారు.ఫేక్ ఏఐ వీడియోలను గుర్తించే స్పెషలైజ్డ్ టూల్స్ – ఫోరెన్సిక్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ పరిజ్ఞానం అందుబాటులో ఉండాలన్నారు.ఈ సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, అటవీశాఖ అధికారులు, టీజీఐఐసీ ఎండీ పాల్గొన్నారు.
READ ALSO : Chennai Super Kings : చెన్నైకి మరో షాక్ – ఢిల్లీ చేతిలో పరాజయం