Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ మరోసారి హాట్ టాపిక్ తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు మరోసారి హాట్ టాపిక్గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య సంవాద యుద్ధం నడుస్తోంది. ప్రాజెక్టు గురించి మంత్రులు చేసిన విమర్శలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆరోపించారు. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రులు ‘కూలేశ్వరం’ అనే పదాన్ని వాడటం సరికాదని అన్నారు.ఆలోచన లేకుండా ఓ భారీ ప్రాజెక్టును విమర్శించడం తగదని కేటీఆర్ హితవు పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కవైపు ప్రాజెక్టు పనికిరాదని చెబుతూనే, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ నుంచి నీరు తీసుకొస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.కాళేశ్వరం లేకపోతే కొండపోచమ్మ, మల్లన్న సాగర్, బస్వాపూర్ ప్రాజెక్టులు కూడా ఉండవని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ ప్రాజెక్టుపై అవగాహన లేకుండానే కామెంట్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

కేటీఆర్ విమర్శలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందన
కేటీఆర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నా గోదావరి జలాలను వినియోగించుకోవడం సాధ్యమేనని స్పష్టం చేశారు.బీఆర్ఎస్ హయాంలో కమీషన్ల కోసం ప్రాజెక్టును రీడిజైన్ చేశారు అని ఆరోపించారు. కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అక్రమాలను బయటపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.”ఎన్నికల ముందు చెప్పిన అబద్ధాలను ఇంకా ఎంత కాలం చెబుతారు?” అంటూ కేటీఆర్పై సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో నిర్మించిన ప్రాజెక్టుల ద్వారానే సాగునీరు అందించవచ్చని, కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులు అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు.
కాళేశ్వరం అవినీతిపై సమగ్ర దర్యాప్తు
ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని నిరూపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. ప్రస్తుతం ఏకసభ్య కమిషన్ విచారణ జరుగుతోందని, దీనికి సంబంధించిన నివేదికను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సమర్పిస్తామని ఆయన తెలిపారు.
కేటీఆర్: రైతులకు నీళ్లు అందకపోవడానికి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం
‘కూలేశ్వరం’ అనొద్దని, అవగాహనతో మాట్లాడాలని సూచన
రేవంత్: గోదావరి నీటి వినియోగానికి కాళేశ్వరం అవసరం లేదు
ప్రాజెక్టులో అవినీతి జరిగిందని రేవంత్ ఆరోపణలు
విచారణ కొనసాగుతోందని, నివేదికను అసెంబ్లీలో సమర్పిస్తామన్న సీఎం