తెలంగాణలో మెట్రో విస్తరణ ప్రాజెక్టు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మెట్రో విస్తరణను తాను అడ్డుకున్నట్లు నిరూపించే దమ్ముందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నయాపైసా కూడా ఖర్చు పెట్టకుండా, మెట్రో ప్రాజెక్ట్ కోసం కేంద్రాన్ని నిందించడం సరైంది కాదని మండిపడ్డారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైన రేవంత్ రెడ్డి, ఇప్పుడు దోషారోపణల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రం కనీస భాగస్వామ్యం లేక కేంద్రాన్ని నిందించడం తగదని విమర్శ
మెట్రో విస్తరణకు కేంద్రం సహకరించలేదని చెప్పే ముందు, రాష్ట్రం ఎలాంటి భాగస్వామ్యం చూపిందో స్పష్టత ఇవ్వాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం సహకారంతోనే హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ విజయవంతంగా సాగుతుందని, అయితే ప్రస్తుత ప్రభుత్వ వైఖరి అభివృద్ధికి ప్రతికూలంగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం విపక్షాలపై ఆరోపణలు చేసే బదులుగా, ప్రజలకు నిర్దిష్ట ప్రణాళికలను వివరించాలి అన్నారు. కేవలం బ్లాక్మెయిలింగ్, ప్రచార రాజకీయాలు చేసేందుకు తాను భయపడబోనని స్పష్టం చేశారు.
“రేవంత్ సీఎం కావడం ప్రజల దురదృష్టం” – కిషన్ రెడ్డి
తెలంగాణ ప్రజలకు రేవంత్ సీఎం కావడం దురదృష్టకరమని కిషన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. అభివృద్ధి గురించి మాట్లాడే బదులుగా, కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం, ప్రజలను తప్పుదోవ పట్టించడమే రేవంత్ రెడ్డి విధానమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా స్వయంగా ప్రభుత్వమే మారిందని, అసలు సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎప్పుడూ సహాయంగా ఉంటుందని, కానీ రాష్ట్రం తన భాద్యతలను నిర్వర్తించకపోతే అభివృద్ధి ఆలస్యం అవుతుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.