వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి ఊరట లభించింది. పోసానికి గుంటూరు సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు, పవన్, లోకేష్పై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసాని అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో జ్యూడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఈనెల 23 వరకు రిమాండ్ విధించారు. అలాగే ఈ కేసులో పోసానిని సీఐడీ అధికారులు ఒకరోజు పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. కస్టడీ విచారణ అనంతరం కూడా మరోసారి కస్టడీకి తీసుకునేందుకు సీఐడీ అధికారులు ప్రయత్నించారు. అయితే ఈలోపే పోసానికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
రేపు పోసాని విడుదలయ్యే అవకాశం
ఇప్పుడు తాజాగా గుంటూరు సీఐడీ కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసింది. అయితే రాష్ట్రంలో పోసానిపై ఇంకా అనేక చోట్ల కేసులు నమోదు అయిన నేపథ్యంలో ఏ జిల్లా నుంచి అయినా పోలీసులు వచ్చి పీటీ వారెంట్తో పోసానిని మరోసారి అదుపులోకి తీసుకుంటారా లేక బెయిల్పై విడుదల అవుతారా అనేది దానిపై ఉత్కంఠ నెలకొంది. రేపు ఉదయం పోసాని విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వైసీపీ నేత మూడు సార్లు అరెస్ట్ అయి రిమాండ్ విధించగా.. మూడు సార్లు కూడా ఆయనకు బెయిల్ లభించింది.