Ramakrishna Murder Case : రామకృష్ణ హత్య కేసులో ఇద్దరు అరెస్ట్ చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసిన ఘోర సంఘటన చోటు చేసుకుంది. పుంగనూరు మండలం కృష్ణాపురంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామకృష్ణను దారుణంగా హత్య చేసిన ఘటనలో కొత్త పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ఈ కేసులో ఇద్దరు ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రధాన నిందితుడు వెంకటరమణతో పాటు ఐదవ నిందితుడు రెడ్డప్ప రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా మిగిలిన ముగ్గురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు. ఈ హత్యకు రాజకీయ కోణం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్పీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రత్యర్థులను భయపెట్టేందుకే ఈ హత్య జరిగిందని తెలిపారు. నిందితుల్లో ఒకరైన రెడ్డప్ప రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నట్లు గుర్తించారు. హత్యకు ముందు నిందితుడు వైసీపీ కీలక నేతలతో ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. దీంతో, ఈ ఘటన వెనుక రాజకీయ ప్రతీకార ధోరణి ఉందని అభిప్రాయపడుతున్నారు.
భూ అక్రమాలపై పోరాటమే హత్యకు కారణమా
రామకృష్ణ భూ ఆక్రమణలు బెదిరింపులపై నిత్యం పోరాటం సాగించేవారని పోలీసులు పేర్కొన్నారు. నిందితులపై గతంలోనూ అనేక ఫిర్యాదులు నమోదైనట్లు తెలుస్తోంది. వీరి అక్రమాలకు అడ్డుగా మారడంతోనే రామకృష్ణను హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, మిగిలిన ముగ్గురి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. వీరి అరెస్టు కోసం పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిందితుల ఆచూకీ త్వరలోనే కనుగొని వారిని అదుపులోకి తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.
హత్యపై టీడీపీ నేతల ఆగ్రహం
రామకృష్ణ హత్య ఘటనపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగా ఆరోపించారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన టీడీపీ నేతలు, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే, రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.
ప్రభుత్వానికి గట్టి సందేశమిచ్చిన టీడీపీ
తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని ప్రకటించారు. నిందితులను కఠినంగా శిక్షించాల్సిందిగా డిమాండ్ చేస్తూ పలు ప్రాంతాల్లో ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. హత్య వెనుక ఉన్న అసలు కారణాలను బయటపెట్టాలని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసుపై పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు, మరింత సమాచారం త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపారు. నిందితుల ముబాయిల్ కాల్ డేటా, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నామని, దర్యాప్తు తుది దశలో ఉందని ఎస్పీ వెల్లడించారు. రామకృష్ణ హత్యకు గల అసలు ఉద్దేశ్యం ఏమిటనేది త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.