ఒంగోలు : ఫొటోల మార్ఫింగ్ కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు ఆయన్ను ఒంగోలు రూరల్ పోలీస్స్టేషన్లో సీఐ శ్రీకాంత్బాబు విచారిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఆర్జీవీ విచారణకు హాజరయ్యారు. న్యాయవాది సమక్షంలో వర్మ విచారణ కొనసాగుతుంది.

గత నవంబర్ లో మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో వర్మపై కేసు నమోదు అయ్యింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి పోస్ట్ చేయడంపై టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణకు హాజరు కావాలని వర్మకు నోటీసులు ఇచ్చారు. అయితే, నవంబర్ 19, 25న విచారణకు ఆర్జీవీ గైర్హాజరయ్యారు. ఆ తర్వాత హైకోర్టుకెళ్ళి.. అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. అయితే, పోలీసుల విచారణకు సహకరించాలని వర్మను హైకోర్టు ఆదేశించింది.
ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు గతంలో నోటీసులు ఇచ్చినా ఆర్జీవీ గైర్హాజరయ్యారు. తాను సినిమా చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నాననీ, వేరొక రోజు వస్తానని వాట్సప్ ద్వారా సమాచారం పంపారు. పోలీసుల అనుమతి లేకుండానే విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగగా.. కొన్నాళ్లపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అదే సమయంలో తనపై పోలీసులు అన్యాయంగా, అక్రమంగా కేసు నమోదు చేశారని, సదరు ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వర్మకు బెయిల్ మంజూరు చేసిన ఉన్నత న్యాయస్థానం.. పోలీసు విచారణకు హాజరై వారికి సహకరించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒంగోలు రూరల్ పోలీసుల ఇటీవల మరోసారి నోటీసులు పంపారు. దీంతో నేడు వర్మ విచారణకు హాజరయ్యారు.