Telangana : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుపై వన్ టైమ్ సెటిల్మెంట్ కు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే జీహెచ్ఎంసీ తరహాలో ఆస్తి పన్నుపై వడ్డీలో 90శాతం రాయితీ ఇవ్వాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవడంతో ఆస్తిపన్ను వసూళ్లు రూ.వెయ్యి కోట్లు దాటిందని రాష్ట్ర పురపాలక శాఖ తెలిపింది.

మార్చి 30, 31న సెలువులైనప్పటికీ ఆస్తి పన్ను చెల్లించవచ్చు
రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కలిపి ఇప్పటివరకు రూ.1010 కోట్ల మేర ఆస్తిపన్ను వసూలైనట్లు వెల్లడించింది. మార్చి 31 నాటికి ఆస్తిపన్ను బకాయిలపై 10 శాతం వడ్డీ చెల్లించిన వారికి ఓటీఎస్ వర్తిస్తుందని పురపాలకశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో మార్చి 30, 31న సెలువులైనప్పటికీ ప్రజలు ఆస్తి పన్ను చెల్లించవచ్చని తెలిపింది. రెండు రోజుల్లో ఆస్తిపన్ను చెల్లించి వడ్డీపై 90శాతం రాయితీ సద్వినియోగం చేసుకోవాలని పురపాలక శాఖ సూచించింది.
ఓటీఎస్ పథకం ద్వారా 90 శాతం వడ్డీ డిస్కౌంట్
కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం ఆస్తి పన్ను బకాయిలు దాదాపు రూ.4 వేల కోట్ల వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన పన్నులు రూ.3 వేల కోట్లు ఉన్నాయని పేర్కొంది. మిగిలిన రూ.1000 కోట్లు గ్రేటర్లోని సుమారు 2 లక్షల మంది నుంచి జీహెచ్ఎంసీకి రావాల్సి ఉంది. ఈ పెండింగ్ బకాయిలకు వడ్డీ కలిపితే.. రూ.2500 కోట్ల వరకు అవుతోంది. ఓటీఎస్ పథకం ద్వారా 90 శాతం వడ్డీ డిస్కౌంట్ ఇస్తే రూ.1150 కోట్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు.