కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. పేదలు, యువత, రైతులు, మహిళలే లక్ష్యంగా బడ్జెట్ లో పలు ప్రతిపాదనలు చేశారు నిర్మలా సీతారామన్. కేంద్ర బడ్జెట్ 2025 ప్రవేశపెట్టిన తర్వాత మొదటిసారి ప్రధాని మోదీ మాట్లాడారు. భారత అభివృద్ధి ప్రయాణంలో ఈ బడ్జెట్ ఓ మైలురాయిగా నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ” భారత్ ను అభివృద్ధి పథంలో నడపడంలో ఈ బడ్జెట్ ఓ మైలురాయిగా నిలుస్తుంది.

140కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంది. ప్రతి భారతీయుడి కలను ఈ బడ్జెట్ నెరవేరుస్తుందని నేను ఆశిస్తున్నాను. యువత కోసం అనేక విధివిధానాలను రూపొందించను న్నాం. ఇక వికసిత్ భారత్ లక్ష్యాన్ని సామాన్య ప్రజలే నడపనున్నారు. ఇది ప్రజల బడ్జెట్. ఈ బడ్జెట్ వల్ల దేశంలో పెట్టుబడులు, ప్రజల సేవింగ్స్ అధికమవుతాయి” అని వీడియో స్టేట్ మెంట్ ద్వారా ఆయన సందేశాన్ని పంపారు. ఇక ఈ బడ్జెట్ లో వేతనజీవులకు భారీ ఉపశమనం లభించింది. వ్యక్తిగత ఆదాయ పన్ను రూ.12 లక్షల వరకు మినహాయింపు ఇస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.30వేల పరిమితితో పట్టణ పేదలకోసం యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు అందిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో పేర్కొన్నారు. విద్యా – మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇచ్చారు.