ముంబయి: భారత నౌకాదళ అమ్ముల పొదిలోకి తాజాగా మరో 3 అస్త్రాలు చేరాయి. ముంబయిలోని నేవల్ డాక్ యార్డులో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరై.. యుద్ధ నౌకలను జాతికి అంకితం చేశారు. అధునాతన యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ నీలగిరి (INS Nilagiri), ఐఎన్ఎస్ సూరత్ (INS Surat), ఐఎన్ఎస్ వాఘ్షీర్లను (INS Waghgheer) బుధవారం నౌకాదళంలో చేర్చుకున్నారు. వీటి రాకతో నౌకాదళ బలం మరింత పటిష్టం కానుంది. ఒకేసారి 3 యుద్ధ నౌకలను ప్రారంభించడం దేశ చరిత్రలోనే తొలిసారి. ఆయుధ తయారీ, సముద్ర భద్రతలో అగ్రగామిగా నిలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోన్న భారత్కు ఇది పెద్ద ముందడుగే అని చెప్పాలి.

ఈ మూడు మేడిన్ ఇండియావి అని అన్నారు. తాము విస్తరణవాదంతో కాదు.. వికాసవాదంతో పనిచేస్తామని చెప్పారు. రక్షణ రంగంలో మేకిన్ ఇండియా ఆవిష్కృతం అవుతోందన్నారు. అలాగే, వన్ ఎర్త్.. వన్ ఫ్యామిలీ.. వన్ ఫ్యూచర్ అని అన్నారు. ఈ మూడు యుద్ధ నౌకలు భారత్కు మరింత శక్తినిస్తాయి అని చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ కార్గో మార్గాలను భారత్ కాపాడుతోందన్నారు. నేవీ బలోపేతం వల్ల ఆర్థిక ప్రగతి కూడా కలుగుతుందన్నారు.
ఐఎన్ఎస్ సూరత్..
ఐఎన్ఎస్ సూరత్ పీ15బీ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్ట్ కింద అభివృద్ధి చేస్తోన్న నాలుగో యుద్ధ నౌక. ప్రపంచంలోనే భారీ, అత్యాధునికి డిస్ట్రాయర్ యుద్ధ నౌకల్లో ఇది ఒకటి. ఇందులో స్వదేశీ వాటా శాతం 75 శాతం. ఈ యుద్ధ నౌకలో నెట్ వర్క్ సెంట్రిక్ సామర్థ్యం సహా అధునాతన ఆయుధ – సెన్సార్ వ్యవస్థలు ఉన్నాయి.
ఐఎన్ఎస్ నీలగిరి..
ఐఎన్ఎస్ నీలగిరి పీ17ఏ స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్టులో తొలి యుద్ధనౌక. శత్రువును ఏమార్చే స్టెల్త్ పరిజ్ఞానంతో దీన్ని తయారుచేశారు. అధునాతన టెక్నాలజీతో దీన్ని రూపొందించగా.. ఇది తర్వాతి తరం స్వదేశీ యుద్ధ నౌకలను సూచిస్తోంది.
ఐఎన్ఎస్ వాఘ్షీర్..
ఐఎన్ఎస్ వాఘ్షీర్ పీ75 కింద రూపొందిస్తున్న ఆరో చివరి జలాంతర్గామి. ఫ్రాన్స్కు చెందిన నేవల్ గ్రూప్ సహకారంతో దీన్ని అభివృద్ధి చేశారు.