తమిళ సినిమా సూపర్స్టార్ విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడులో తన పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఆవిర్భావ దినోత్సవాన్ని మహాబలిపురంలో ఘనంగా నిర్వహిస్తున్న ఆయన, ఈ సందర్భంగా 2026 అసెంబ్లీ ఎన్నికలకు తన సమరశంఖాన్ని పూరించనున్నారు. ఈ వేడుకల్లో ఆయనతో పాటు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా వేదికను పంచుకోనున్నారు. ఇదే కాకుండా, పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి హాజరు కావడం కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సమావేశంలో లక్షలాది మంది కార్యకర్తలు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ సర్వసభ్య మండలి, కార్యాచరణ మండలి సమావేశాల తేదీలను కూడా విజయ్ ప్రకటించనున్నారు.
విజయ్తో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్
ఇటీవల విజయ్తో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై విస్తృత చర్చలు జరిపారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ వ్యూహకర్తగా పనిచేయడానికి ఆయన అంగీకరించారు. విజయ్ ప్రత్యేక సలహాదారుడిగా తన మార్గదర్శకతను అందిస్తానని హామీ ఇచ్చిన పీకే, తన వ్యూహాలతో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా టీవీకే ఇప్పటికే ‘గెట్అవుట్’ అనే క్యాంపెయిన్ ప్రారంభించింది. ఈ ప్రచారం అధికార డీఎంకే, కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి నేరుగా ఆరోపణలు లేకుండానే, తమిళనాడు ప్రయోజనాలను విస్మరిస్తోన్న రహస్య కూటమిపై విమర్శలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఫ్లెక్సీలు వెలిశాయి. గతంలో డీఎంకే # గెట్అవుట్ మోదీ, బీజేపీ # గెట్అవుట్ స్టాలిన్ అనే క్యాంపెయిన్లను నిర్వహించిన నేపథ్యంలో, ఇప్పుడు విజయ్ కూడా అదే తరహాలో తనదైన రాజకీయ దారిని రూపొందించుకుంటున్నట్లు కనిపిస్తోంది.విజయ్ రాజకీయ ప్రవేశాన్ని గతంలో సినిమా రంగం నుంచి వచ్చిన దిగ్గజ నేతలైన ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్), జయలలితలతో పోల్చడం జరుగుతోంది. అయితే, శివాజీ గణేశన్, విజయకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖ నటులు రాజకీయాల్లో ప్రభావం చూపించలేకపోయిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. రజినీకాంత్ వంటి స్టార్ కూడా ఈ విషయంలో వెనుకడుగు వేశారు.అయితే, విజయ్ మాత్రం తన రాజకీయ ప్రయాణాన్ని విజయవంతంగా మలచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో పాలన, శాంతిభద్రతలు, కుటుంబ రాజకీయాలపై తరచూ విమర్శలు గుప్పిస్తున్నారు. తమిళ ప్రజల్లో తనదైన మార్గదర్శకుడిగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’
రాష్ట్ర రాజకీయాలకే కాకుండా, కేంద్రంలోని మోదీ ప్రభుత్వ విధానాలపై కూడా విజయ్ నిరంతర విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ బిల్లుపై ఆయన తీవ్రంగా స్పందించి, ఈ విధానం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. ఇక, తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే ప్రస్తుతం నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో విజయ్ తన పార్టీని ఆ పార్టీతో పొత్తుపెట్టుకుని బలపడే అవకాశముందన్న ప్రచారం సాగుతోంది. అన్నాడీఎంకే, టీవీకే మధ్య పొత్తు జరిగితే, డీఎంకేకు 2026 ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముంది.
డీఎంకే వ్యూహకర్త
ప్రశాంత్ కిషోర్ గత ఎన్నికల్లో డీఎంకే వ్యూహకర్తగా పనిచేసి విజయాన్ని అందించారు. కానీ, ఇప్పుడు విజయ్ కోసం వ్యూహాలు రచించనుండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. టీవీకే పార్టీని విజయ్ తమిళనాడులో అధికారాన్ని దక్కించుకునే స్థాయికి ఎలా తీసుకెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. 2026 ఎన్నికల వరకూ విజయ్ ప్రయాణాన్ని గమనిస్తూ ఉండాలి. మరి, ఆయన తన దిశగా విజయాన్ని ఎలా మలుచుకుంటారనేది వేచి చూడాల్సిన విషయం.