ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను అవమానించేలా సోషల్ మీడియా (Social Media) ప్లాట్ఫాంలలో పోస్టులు పెట్టిన ముగ్గురిని కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని పిఠాపురం సీఐ జి. శ్రీనివాస్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. జనసేన కార్యకర్తల ఫిర్యాదుతో ఈ అరెస్టులు జరిగాయి.
మార్ఫింగ్ ఫోటోతో అసభ్య ప్రచారం
విశాఖపట్నంలో ఇటీవల జరిగిన ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఉన్న ఫోటోను మార్ఫింగ్ చేసి పవన్ను కించపరిచేలా ప్రచారం చేశారు. మార్ఫింగ్ చేసిన ఫోటోను వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్) వంటి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా పంచారు. ఈ చర్య పట్ల జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసి పిఠాపురం పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మూడు ప్రాంతాల నుంచి నిందితుల అరెస్ట్
పోలీసుల విచారణలో బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాకు చెందిన కర్రి వెంకట సాయి వర్మ, మచిలీపట్టణం వలందపాలెంకు చెందిన పాముల రామాంజనేయులు, హైదరాబాద్ సరూర్నగర్ సింగరేణి కాలనీకి చెందిన షేక్ మహబూబ్ అనే ముగ్గురు వ్యక్తులు ఇందులో పాత్ర వహించినట్లు తేలింది. వారిని అరెస్టు చేసి మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Read Also : APSRTC: 2 వేల బస్సులు కొనేందుకు సిద్ధం