న్యూఢిల్లీ: ప్రధాని మోడీ నక్సలిజంపై కీలక వ్యాఖ్యలు చేశారు.అడవుల్లో నక్సలిజం క్రమంగా అంతమవుతోందని, దురదృష్టవశాత్తూ పట్టణాలు, నగరాల్లో వేగంగా పాతుకుపోతోందని అని అన్నారు. ఇది తీవ్ర ఆందోళన కలిగించే పరిణామమని వ్యాఖ్యానించారు. అయితే.. ఈ నక్సలిజానికి కొన్ని పార్టీలు వత్తాసు పలుకుతున్నాయని, ఇది దారుణమని అన్నారు.

ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్లే ఇది సాధ్యం
దేశంలో నక్సలిజం అంతిమ దశలో వుందని, గతంలో 100 జిల్లాలు నక్సలిజం వల్ల ప్రభావితం అయ్యేవని, ప్రస్తుతం ఆ జిల్లాల సంఖ్య రెండే డజన్లకి తగ్గిపోయిందని ప్రకటించారు. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఓ వైపు అడవుల నుంచి నక్సలిజాన్ని రూపుమాపుతుంటే, మరోవైపు అర్బన్ నక్సలిజం నెట్ వర్క్ వేగంగా విస్తరిస్తోందన్నారు. భారతీయ సంస్కృతిని, దేశ అభివృద్ధిని అర్బన్ నక్సల్స్ వ్యతిరేకిస్తారని మండిపడ్డారు. గతంలో అర్బన్ నక్సల్స్ ను వ్యతిరేకించిన పార్టీలే ఇప్పుడు వారికి వత్తాసు పలుకుతున్నాయని మోడీ మండిపడ్డారు.
భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ
అర్బన్ నక్సల్స్తో కొత్త సవాళ్లు ఎదురవుతున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. పట్టణ నక్సల్స్ వల్ల భారత అభివృద్ధి, వారసత్వానికి ప్రమాదం ఏర్పడిందన్నారు. మేధావి వర్గాల్లో భావజాల తీవ్రవాదం పెరుగుతున్నట్లు చెప్పారు. భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశయాలను చంపేసిందన్నారు. ఆ పార్టీ నుంచి ప్రజలు కూడా ఆశించడం మానేసినట్లు తెలిపారు.