ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. సింగపూర్ స్కూల్లో చదువుకుంటున్న పవన్ కల్యాన్ చిన్నకుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్కి స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఇబ్బందులకు గురయ్యాడు. మార్క్ శంకర్ను స్కూల్ సిబ్బంది వెంటనే మార్క్ శంకర్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మోదీ స్పందన
ఈ ప్రమాద ఘటనపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. పవన్ కల్యాణ్కు ఫోన్ చేసిన ప్రదాని మోదీ, మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. అవసరమైన సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.సింగపూర్ కాలమానం ప్రకారం ఈ ఉదయం 9:45 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. ‘రివర్ వ్యాలీ రోడ్ షాప్ హౌస్’ బిల్డింగ్లో మంటలు చెలరేగాయి. అదే భవనంలోని స్కూల్లో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో15-19 మంది విద్యార్థులు గాయపడగా, ఒకరు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. మార్క్ శంకర్కు ప్రాణహాని లేకుండా కాపాడిన సిబ్బందికి ఏపీ మంత్రి నాదెండ్ల మనోహార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రమాదంపై సింగపూర్ డిఫెన్స్ ఫోర్స్ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలని జనసేన కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి స్పందన
ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించిన ముఖ్యమంత్రి మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కొద్దిసేపటి క్రితమే మన్యం జిల్లా పర్యటన ముగించుకుని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విశాఖపట్నం చేరుకున్నారు. మరికాసేపట్లో జనసేనాని సింగపూర్ బయల్దేరి వెళ్లనున్నారు. పవన్ అన్నయ్య చిరంజీవి, వదిన సురేఖ కూడా సింగపూర్ వెళుతున్నారని సమాచారం.