PM Modi : నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల ఖర్చు ఎంతంటే ? భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల ఖర్చుపై కేంద్ర ప్రభుత్వం తాజా వివరాలను వెల్లడించింది. ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మోదీ అనేక అంతర్జాతీయ పర్యటనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రధాని విదేశీ పర్యటనల కోసం ఖర్చయిన మొత్తం వివరాలను అడిగారు. దీనికి కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గెరిటా సమాధానం ఇచ్చారు.ప్రధాని మోదీ 2022 మే నుంచి 2024 డిసెంబర్ వరకు 38 విదేశీ పర్యటనలు చేపట్టారని, వాటిపై మొత్తం రూ. 258 కోట్లు ఖర్చయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.ఈ కాలంలో అత్యధిక ఖర్చు 2023 జూన్లో జరిగిన అమెరికా పర్యటన కోసం వెచ్చించారని తెలిపారు. రూ. 22 కోట్లు ఆ పర్యటన కోసం ఖర్చు అయినట్లు సమాచారం.అలాగే, 2024 సెప్టెంబర్లో జరిగిన మరో అమెరికా పర్యటనకు రూ. 15.33 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్రం తెలిపింది.
ఏయే దేశాలకు వెళ్లారు?

2022 నుంచి 2024 మధ్య కాలంలో ప్రధాని మోదీ పర్యటించిన దేశాల్లో
అమెరికా
జపాన్
జర్మనీ
కువైట్
డెన్మార్క్
ఫ్రాన్స్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)
ఉజ్బెకిస్థాన్
ఇండోనేషియా
ఆస్ట్రేలియా
ఈజిప్ట్
దక్షిణాఫ్రికా
గ్రీస్
పోలాండ్
ఉక్రెయిన్
రష్యా
ఇటలీ
బ్రెజిల్
గయానా
వంటి దేశాలు ఉన్నాయి.
ప్రధాని విదేశీ పర్యటనల ముఖ్య ఉద్దేశ్యం
ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు ప్రధానంగా భారత దౌత్య, వ్యాపార, పెట్టుబడుల రంగాలను బలోపేతం చేయడానికే అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అంతర్జాతీయ సంబంధాలను మరింత పటిష్టం చేయడంతోపాటు, భారత వ్యాపార, వాణిజ్య అవకాశాలను విస్తరించడమే లక్ష్యంగా ఈ పర్యటనలు ఉంటాయని స్పష్టం చేసింది.ఈ వివరాలపై ప్రతిపక్షం నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. ప్రభుత్వ ఖర్చులను సమర్థంగా వినియోగించాలన్న వాదనను ప్రతిపక్ష నేతలు చెబుతుండగా, ప్రభుత్వం మాత్రం విదేశీ పర్యటనల ద్వారా దేశానికి పెద్ద ఎత్తున ప్రయోజనాలున్నాయని పేర్కొంటోంది.