వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ లోని రొనాల్డ్ రీగన్ విమానాశ్రయం సమీపంలో ఓ విమానం పొటోమాక్ నదిలో కుప్పకూలింది. పీఎస్ఏ ఎయిర్లైన్స్కు చెందిన చిన్న విమానం గాలిలో ఓ హెలికాప్టర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రాణనష్టంపై ఎలాంటి సమాచారం లేదు. కానీ కొందరు ప్రయాణికులు మాత్రం గాయపడ్డట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే విమానంలో 60 మంది ప్రయాణికులు ఉన్నట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరగడంతో రొనాల్డ్ రీగన్ ఎయిర్పోర్టు నుంచి పలు విమానాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వాషింగ్టన్ సమీపంలోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్టులో విమానం ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
పీఎస్ఏ ఎయిర్లైన్స్కు చెందిన 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో కాన్సాస్లోని విషిటా నుంచి బయల్దేరింది. రోనాల్డ్ రీగన్ ఎయిర్పోర్టులో దిగేందుకు సిద్ధమవుతుండగా.. రక్షణ శాఖకు చెందిన సికోర్స్కీ హెచ్-60 బ్లాక్హాక్ హెలికాప్టర్ను ఢీకొట్టింది. దీంతో భారీ శబ్ధంతో అవి రెండూ నదిలో కుప్పకూలాయి. అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన ఆ విమానాన్ని పీఎస్ఏ నిర్వహిస్తున్నది. సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రయాణికుల కోసం నదిలో గాలిస్తున్నారు.