Piyush Goyal : కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రపంచ వాణిజ్యంలో చైనా ఆధిపత్యం పెరుగుతుండటంపై గోయల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..కీలక వ్యాఖ్యలు చేశారు. అన్యాయమైన వాణిజ్య పద్ధతులను ఉపయోగించి చైనా ఆర్థికవృద్ధిని సాధిస్తోందని ఆరోపించారు. ధరల వక్రీకరణ, అస్పష్ట సబ్సిడీలు, ప్రపంచ వాణిజ్య నిబంధనలను ఉల్లంఘించే కార్మిక పద్ధతులు బీజింగ్ వృద్ధికి కారణమన్నారు.

భారత్ వంటి ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం
ఇది భారత్ వంటి ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే.. ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఈసందర్భంగా ప్రపంచ వాణిజ్య నిబంధనల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఇక, ఈ సందర్భంగా గోయల్ యూపీఏపై పలు ఆరోపణలు చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ కాలంలో భారత్- చైనాల మధ్య వాణిజ్య లోటు సాధారణంగా ఉందన్నారు. అయితే, యూపీఏ హయాంలో అది 25 రెట్లు పెరిగిందని ఆరోపించారు.
వాణిజ్య యుద్ధానికి, ఆర్థిక వ్యవస్థల మందగమనానికి దారితీయొచ్చు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజింగ్లోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అది మమ్మల్ని ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ ఒప్పందం తర్వాత భారత్లోకి వచ్చిన అనేక డ్రాగన్ ఉత్పత్తులపై సుంకాలు గణనీయంగా తగ్గాయి. ఇది మన స్థానిక ఉత్పాదక రంగాలపై తీవ్ర ప్రభావం చూపించింది. మనం పూర్తిగా చైనాపై ఆధారపడేలా చేసింది అని గోయల్ పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలకు చైనా కూడా అగ్రరాజ్యం ఉత్పత్తులపై టారిఫ్లు విధించింది. దీంతో వాణిజ్య యుద్ధానికి, ఆర్థిక వ్యవస్థల మందగమనానికి దారితీయొచ్చనే ఆందోళనలు ప్రపంచ స్టాక్మార్కెట్లను వణికించాయి.
Read Also : విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్