ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో అందించే మధ్యాహ్న భోజన మెనూలో ముఖ్యమైన మార్పులు చేయాలని నిర్ణయించింది. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రుచికరంగా ఉండే అధిక పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వారంలో రెండు రోజులు పిల్లలకు ఎగైడ్ రైస్, ఉదయం ఉడికించిన శనగలు అందించనున్నారు.
మునగపొడి, చక్కెర స్థాయిలో మార్పులు
ప్రతిరోజు అందే కూరల్లో మునగపొడిని ఉపయోగించనున్నట్టు అధికారులు తెలిపారు. మునగపొడి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందించే శక్తివంతమైన పదార్థంగా గుర్తించారు. అంతేకాకుండా చిన్నారులకు ఇచ్చే ‘బాలామృతం’లో చక్కెర స్థాయిని తగ్గించే నిర్ణయం తీసుకున్నారు. ఇది వారి ఆరోగ్యంపై మంచిపరిణామాలు చూపుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పైలట్ ప్రాజెక్టుగా విజయవంతం – రాష్ట్రవ్యాప్తంగా అమలు
ఈ మార్పులను తొలుత పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని నాలుగు జోన్ల పరిధిలోని ఒక్కో అంగన్వాడీ కేంద్రంలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఈ ప్రయత్నానికి మంచి స్పందన రావడంతో, త్వరలోనే 26 జిల్లాల్లోని ఒక్కో అంగన్వాడీ కేంద్రంలో ఈ కొత్త మెనూను అమలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానం అమలవుతుందనేది అధికారుల భావన. చిన్నారుల పోషణను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది.