ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తుండగా, వైసీపీ సభ్యులు అసెంబ్లీలో అనాగరికంగా ప్రవర్తించి, కాగితాలు విసిరేయడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలతో పాటు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. గవర్నర్ అనే గౌరవం లేకుండా వైసీపీ సభ్యులు ప్రవర్తించడం దారుణమని, ఇలాంటి నేతలను ఎన్నేళ్ల పాటు ఎదుర్కొన్న చంద్రబాబు ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందేనని పవన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అసెంబ్లీలో వైసీపీ అరాచకాలను ఖండించిన పవన్
పవన్ మాట్లాడుతూ, వైసీపీ నేతలు గొడవలు, బూతులతోనే రాజకీయ జీవితాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. గత ఐదేళ్ల కాలంలో ప్రజావేదిక కూల్చివేత, ఆలయాల విధ్వంసం, డాక్టర్ సుధాకర్ మరణం, కల్తీ సారా మరణాలు, న్యాయమూర్తులపై విమర్శలు, మీడియా అధిపతులపై దాడులు, చంద్రబాబును 53 రోజుల పాటు జైలులో పెట్టిన తీరు ఈ సంఘటనలన్నీ వైసీపీ పాలనను గుర్తు చేస్తున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ నేతలు ఐదేళ్లుగా వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి ఎంతగా ప్రయత్నించారో, అసెంబ్లీలో వారి ప్రవర్తన చూస్తే మరింత అర్థమవుతుందని పవన్ తెలిపారు.
ప్రజలు వైసీపీని తిరస్కరించడంలో అర్థం ఇదే – పవన్
ప్రజలు వైసీపీ పాలనను తిరస్కరించడంలో స్పష్టమైన కారణాలున్నాయి అని పవన్ అన్నారు. అసెంబ్లీలోనే వారు ఇంతలా గొడవలు సృష్టిస్తే, బయట ఎలాంటి విధ్వంసం సృష్టించేవారో ఊహించుకోవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు ఈసారి తమ తీర్పుతో వైసీపీని మట్టి కరిపించారని, అత్యధిక మెజారిటీతో కూటమిని గెలిపించడం ప్రజల నమ్మకానికి నిదర్శనమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. చట్టాలను రూపొందించాల్సిన ఎమ్మెల్యేలు వాటిని ఉల్లంఘిస్తే ప్రజాస్వామ్యానికి ఎలాంటి ముప్పొస్తుందో ప్రజలు అర్థం చేసుకున్నారని ఆయన అన్నారు. వైసీపీ తీరు చూస్తుంటే, ప్రజలు వారి పాలనను తిరస్కరించడం సహజమే అని పవన్ పేర్కొన్నారు.