Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు కరాటే బ్లాక్బెల్ట్లో శిక్షణ ఇచ్చిన గురువు షిహాన్ హుసైని మృతిపై స్పందించారు. ఆయన మరణవార్త తననెంతో బాధించిందన్నారు పవన్ కల్యాణ్. ఈసందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ పోస్ట్ పెట్టారు. షిహాన్ హుసైని తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యాను. ఆయన వద్ద కరాటేలో శిక్షణ పొందాను. ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారని నాలుగు రోజుల క్రితమే తెలుసుకున్నాను అన్నారు.

కఠినమైన నిబంధనలతో కరాటే నేర్పారు
ఈనెల 29న ఆయన్ని పరామర్శించడానికి చెన్నై వెళ్లాలనుకున్నా. కానీ, ఈలోపు ఈ దుర్వార్త వినాల్సి వస్తుందనుకోలేదు. కఠినమైన నిబంధనలతో కరాటే నేర్పారు. ఆయన చెప్పినవన్నీ కచ్చితంగా పాటించేవాడిని. మొదట ఆయన నాకు కరాటే నేర్పేందుకు అంగీకరించలేదు. ప్రస్తుతం శిక్షణ ఇవ్వడం లేదు.. కుదరదు అన్నారు. ఎంతో బతిమాలితే అంగీకరించారు. తెల్లవారుజామున వెళ్లి సాయంత్రం వరకూ అక్కడే ఉండేవాడిని. తమ్ముడు సినిమాలో సన్నివేశాలకు ఆ శిక్షణే ఉపయోగపడింది. షిహాన్ హుసైని కరాటేలో సుమారు 3 వేల మందికి శిక్షణ ఇచ్చారు. తమిళనాడులో ఆర్చరీ క్రీడకు ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేశారు.
స్ఫూర్తినిచ్చేలా ఎన్నో ప్రసంగాలు
ఆ రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్లో ముఖ్య బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. స్ఫూర్తినిచ్చేలా ఎన్నో ప్రసంగాలు చేశారు. మరణానంతరం తన దేహాన్ని మెడికల్ కాలేజీకి అందజేయాలని ప్రకటించడం ఆయన గొప్ప ఆలోచనా విధానానికి నిదర్శనం అంటూ షిహాన్ హుసైని కుటుంబానికి పవన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. షిహాన్ హుసైని 1986లో విడుదలైన పున్నగై మన్నన్ చిత్రం ద్వారా తమిళ చిత్రసీమకు పరిచయమయ్యారు. పలు చిత్రాల్లో నటించిన ఆయనకు విజయ్ హీరోగా నటించిన బద్రి సినిమా గుర్తింపునిచ్చింది.