జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగిన జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి లోనయ్యారు. తెలంగాణ భూమిపై జనసేన పుట్టిందని, ఆంధ్రప్రదేశ్ తన కర్మభూమి అని పేర్కొన్నారు. తెలంగాణను కోటి రతనాల వీణగా కొనియాడారు. తన జీవితంలో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉందని, ఒకప్పుడు తనకు కరెంట్ షాక్ తగిలినప్పుడు ప్రాణాలతో బయటపడటానికి కొండగట్టు ఆంజనేయస్వామి దీవెనలతో పాటు, తెలంగాణ ప్రజల ప్రేమే కారణమని పవన్ గుర్తు చేశారు.
గద్దర్పై పవన్ కళ్యాణ్ భావోద్వేగం
తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్ గురించి పవన్ ప్రస్తావిస్తూ ఆయనను తన అన్నగారు అని పేర్కొన్నారు. “బండినెక బండికట్టి, కాలికి గజ్జెకట్టిన వాడు… నాకు కనిపిస్తే ‘ఎలా ఉన్నావురా తమ్మీ’ అని ఆప్యాయంగా పలకరించే మన గద్దరన్న ఇక మన మధ్య లేరు. అయితే ఆయన పాటలు, ఆయన ఆత్మ, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి” అంటూ భావోద్వేగానికి గురయ్యారు. జనసేన తలపెట్టిన మార్పు కోసం తెలంగాణ పోరాట స్ఫూర్తి ఎంతో సహాయపడుతుందని పేర్కొన్నారు.
జనసేన వీరమహిళలపై పవన్ ప్రసంసలు
పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో జనసేన మహిళా కార్యకర్తలపై ప్రశంసలు కురిపించారు. “మీరు అందరి దృష్టిలో రాణి రుద్రమదేవిలు. సూర్యభగవానుడి లేలేత కిరణాల్లా మెరుస్తూ, అవసరమైతే లేజర్ బీమ్లా శత్రువులను ఎదుర్కొనే వీరమహిళలు మా జనసేనలో ఉన్నారు” అని పవన్ పేర్కొన్నారు. తెలంగాణ మహిళలు తమ పోరాట స్ఫూర్తిని ఎప్పటికీ కొనసాగించాలని, వారి ధైర్యం, పట్టుదల జనసేనకు గొప్ప బలం అని పేర్కొన్నారు.

తెలంగాణకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు
తన రాజకీయ ప్రస్థానంలో, వ్యక్తిగత జీవితంలో కూడా తెలంగాణకు ఉన్న ప్రాముఖ్యతను పవన్ కళ్యాణ్ వివరించారు. “జనసేన పుట్టింది తెలంగాణ గడ్డపైనే. నా కోసం పోరాడిన, నా వెన్నంటే నిలబడ్డ ప్రతి తెలంగాణ జనసైనికుడికి నేను రుణపడి ఉంటాను” అంటూ తన కృతజ్ఞతను తెలిపారు. భవిష్యత్తులో జనసేన తెలంగాణలో కూడా బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని కోరుకుంటున్నట్లు పవన్ తెలిపారు. “తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలు, ప్రేమ ఎప్పటికీ మా వెంట ఉంటాయి” అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.