దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈనెల 8న ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటికీ, 10 రోజులు పూర్తయినా ముఖ్యమంత్రి ఎవరు అనే అంశంపై ఇప్పటికీ కమలం స్పష్టత ఇవ్వలేదు. ఈ కారణంగా రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు, బీజేపీ శాసనసభా పక్ష సమావేశం ఈనెల 19న నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అదే రోజు సీఎం అభ్యర్థిని ఎంపిక చేసి, 20వ తేదీన కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశముందని సమాచారం. ఇదివరకు సీఎం ప్రమాణ స్వీకారం ఇవాళ లేదా రేపట్లో ఉంటుందని ఊహాగానాలు వచ్చినప్పటికీ, తాజా పరిణామాల ప్రకారం ఈ ప్రక్రియ మరికొన్ని రోజులు కొనసాగనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో కొత్త ముఖ్యమంత్రి పగ్గాలు ఎవరి చేతికి వెళ్తాయన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ఢిల్లీ సీఎం పదవికి ముందంజలో పర్వేష్ వర్మ?
ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికలో పర్వేష్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్పై విజయం సాధించి ఆమ్ ఆద్మీ పార్టీని గట్టి దెబ్బకొట్టిన ఆయనకు పగ్గాలు అప్పగించాలనే ఆలోచన బీజేపీ హైకమాండ్లో ఉంది. అయితే రేఖ గుప్తా, విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ, వీరేంద్ర సచ్దేవా, బన్సూరి స్వరాజ్, హరీష్ ఖురానా తదితర నేతల పేర్లు కూడా రేసులో ఉన్నాయి.
ప్రమాణ స్వీకార ఏర్పాట్లు వేగంగా:
బీజేపీ 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎన్నికకు చర్చలు తారస్థాయికి చేరుకున్నాయి. ఢిల్లీ ప్రజలు కొత్త సీఎంగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనే ఉత్కంఠలో ఉన్నారు. అధిష్ఠానం తుది నిర్ణయాన్ని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. అధికారాన్ని దక్కించుకోవడంతో ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఢిల్లీ రామ్లీలా మైదానంలో కొత్త సీఎం ప్రమాణం చేయనున్నట్లు సమాచారం 70 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 48 స్థానాలు గెలుచుకోగా, ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకు పరిమితమైంది.
కొత్త సీఎం ఎవరవుతారనే ఉత్కంఠ:
నూతన సీఎంగా ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారన్న ఉత్కంఠ ఢిల్లీ ప్రజల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా నెలకొంది. అధికార ప్రతిష్టను నిలబెట్టేలా బీజేపీ ఎవరి పేరును ఖరారు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
అంతేకాదు, విపక్షాలు కొత్త సీఎంగా ఎవరికి అవకాశం కల్పిస్తారనే దానిపై కూడా నిశితంగా గమనిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయం, కేంద్రం వ్యూహాలు, బీజేపీ లోపలి రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం, అధిష్ఠానం గత ఎన్నికల్లో ప్రదర్శన, ప్రాంతీయ సమీకరణాలు, నాయకత్వ సామర్థ్యాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఢిల్లీ రాజకీయ సమీకరణాల్లో కొత్త కీలక పరిణామాల కోసం ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కొత్త సీఎం పేరు ప్రకటించేందుకు కౌంటింగ్ అనంతరం జరిగిన బీజేపీ శాసనసభా పార్టీ సమావేశాన్ని వేచి చూడాల్సి ఉంది. పార్టీ శ్రేణులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కీలక నిర్ణయం త్వరలో వెలువడనుంది.