Panna Pemmasani : వైసీపీని వీడి టీడీపీలో చేరిన వడ్డెర నేతలు గుంటూరులో టీడీపీకి కొత్త శక్తి చేరింది వడ్డెర సామాజిక వర్గానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు వైసీపీకి గుడ్బై చెప్పి టీడీపీలో చేరారు. ఈ చేరిక కేంద్ర సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సమక్షంలో జరిగింది.ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, టీడీపీ బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉన్న పార్టీ అని స్పష్టం చేశారు. గత వైసీపీ పాలనలో బీసీలను పూర్తిగా విస్మరించారని, బీసీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసారని తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం మాత్రం బీసీల హక్కులను కాపాడేందుకు కృషి చేస్తోందని, వారి అభివృద్ధికి అవసరమైన అన్ని విధానాలను అమలు చేస్తుందని తెలిపారు.

వైసీపీ పాలనలో తమ వర్గం పూర్తిగా చిన్నబోయిందని, పార్టీ పెద్దలు పట్టించుకోలేదని వడ్డెర సామాజిక వర్గ నేతలు ఆరోపించారు.తమ వర్గాన్ని రాజకీయంగా నాశనం చేసే ప్రయత్నం జరిగిందని, అందుకే తమ భవిష్యత్తును టీడీపీతో బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.పెమ్మసాని మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ బీసీలకు దేశవ్యాప్తంగా రాజకీయ గుర్తింపు తీసుకువచ్చిన పార్టీ అని గుర్తుచేశారు. బీసీ సంక్షేమానికి ఎన్టీఆర్ మొదలుపెట్టిన మార్గాన్ని చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. ఈ మధ్య కాలంలో వైసీపీని వీడి టీడీపీలో చేరే నేతల సంఖ్య పెరుగుతోంది. తాజా వడ్డెర నేతల చేరిక టీడీపీకి మరింత బలాన్ని తీసుకువచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, బీసీ వర్గాల్లో టీడీపీ పెరుగుతున్న ఆదరణ వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బగా మారుతుందని విశ్లేషకుల అంచనా.