భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) చేసిన ప్రసంగం మరోసారి భారత–పాకిస్థాన్ (India–Pakistan) మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ‘ఆపరేషన్ సిందూర్’ (operation sindoor) విజయాన్ని వెల్లడిస్తూ ఉగ్రవాదంపై తన గట్టి అభిప్రాయాలను వ్యక్తం చేసిన మోదీ, పాకిస్థాన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఆపరేషన్లో భారత సాయుధ బలగాలు పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయనీ, ఎంతోమంది ఉగ్రవాదులను హతమార్చారని చెప్పారు. ఉగ్రవాదంపై ప్రతీకార చర్యలు పూర్తి కాలేదని, భారత్ కేవలం విరామం ఇచ్చిందని ఆయన హెచ్చరించారు.
పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందన
ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. మోదీ వ్యాఖ్యలను రెచ్చగొట్టేవిగా, వివాదాస్పదంగా పేర్కొంటూ ఖండించింది. పాకిస్థాన్ ఇప్పటికీ కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉందని, ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం తమవంతుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని స్పష్టం చేసింది. భారత్ కూడా ఇదే మార్గంలో నడవాలని, తమ పౌరుల శ్రేయస్సును పరిగణలోకి తీసుకోవాలని పాక్ పేర్కొంది. అదేవిధంగా భవిష్యత్తులో ఎలాంటి దురాక్రమణ జరిగితే, దానికి పూర్తి స్థాయిలో ప్రతిఘటన చేస్తామని హెచ్చరించింది.
భారత్ శాంతిని కోరుకుంటుందని, కానీ దాడి జరిగితే ఎదురు దాడి చేస్తాం
ఇక మంగళవారం పంజాబ్లోని ఆదంపూర్ వాయుసేన స్థావరంలో సైనికుల్ని ఉద్దేశించి మరోసారి మోదీ గట్టి హెచ్చరిక చేశారు. భారత్ శాంతిని కోరుకుంటుందని, కానీ దాడి జరిగితే ఎదురు దాడికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని అన్నారు. పాకిస్థాన్ తమ భూమిని మళ్లీ ఉగ్రవాద దాడులకు వేదికగా వాడతే, ఆ దేశం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మోదీ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో ఇండియా–పాక్ సంబంధాల్లో మరోసారి ఉద్రిక్తతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
Read Also : Chandrababu Naidu : సముద్ర తీర ప్రాంత అభివృద్ధిపై సమీక్ష : సీఎం చంద్రబాబు