పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్థాన్ మధ్య పరిస్థితి ఉప్పు-నిప్పులాగా మారింది. దాడి తర్వాత పాకిస్థాన్ భయపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రతీకార దాడి ఎలా ఉంటుందోనని పాకిస్థాన్ ఆయోమయానికి గురవుతోంది. ఇదే సమయంలో మరో 36 గంటల్లో పాకిస్థాన్పై భారత్ సైనిక చర్య చేపడుతుందన్న ఆ దేశ మంత్రి వ్యాఖ్యలతో దాయాది దేశం అప్రమత్తమైంది. ఈ క్రమంలో మోస్ట్ వాంటెండ్ టెర్రరిస్టు, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్కు భారీ భద్రతను పెంచినట్లు అంతర్జాతీయ మీడయా కథనాలు చెబుతున్నాయి.

సయీద్ భద్రత కోసం స్పెషల్ సర్వీస్ గ్రూప్ మాజీ కమాండోలు
గత అనుభవాల దృష్ట్యా పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ కచ్చితంగా ప్రతీకార దాడి చేస్తుందని పాకిస్థాన్ నమ్ముతోంది. అయితే ఈసారి భారత్ చేసే లక్షిత దాడులు కచ్చితంగా హఫీజ్ సయీద్తో పాటు ఆయన అనుచరులే టార్గేట్గానే జరుగుతాయని పాక్ నమ్ముతోంది. ఈ క్రమంలోనే సయీద్తో పాటు అతని అనుచరులకు కూడా పాక్ ఆర్మీ కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటు చేసింది. సయీద్ భద్రత కోసం స్పెషల్ సర్వీస్ గ్రూప్ మాజీ కమాండోలను మోహరించినట్లు వరల్డ్ మీడియా చెబుతోంది. ఇది కాకుండా, లాహోర్లోని మొహల్లా జోహార్లోని అతని ఇల్లు సహా అతని నివాసాల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు.
సబ్-జైలులో సయీద్
సయీద్ ప్రస్తుతం జైలులో ఉన్నట్లు పాకిస్థాన్ ప్రపంచానికి చెబుతోంది. అయితే అతని ఇంటిని సబ్-జైలుగా మార్చి అందులోనే సయీద్ ఉంటున్నట్లు దాయాది దేశం చాలా ఏళ్లుగా నమ్మబలుకుతోంది. ఇప్పుడు ఈ ఇంటికి పాక్ సైన్యం భారీగా భద్రతను కల్పిస్తోంది. ఒక కిలోమీటరు పరిధిలో కార్యకలాపాలను పర్యవేక్షించడానికి సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ సీసీ కెమెరాలను కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు.
Read Also:Attari-Wagah Border: తమ పౌరులను స్వదేశంలోకి వచ్చేందుకు తెరిచిన అట్టారీ-వాఘా సరిహద్దు