పాకిస్థాన్ (Pakistan) మనపై చేస్తున్న దాడులపై ప్రతిదాడిగా పాక్లోని ఎయిర్ బేస్లను ధ్వంసం చేసినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వెల్లడించారు. పాకిస్థాన్లోని చక్లాలా, మురిద్, రహిమ్యార్ ఖాన్, రఫీకి ఎయిర్ బేస్లను భారత్ ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు పాకిస్థాన్ మన ఎయిర్ బేస్లపై దాడి చేసినట్లు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేసుకుంటున్నట్లు కూడా ఆయన ఆరోపించారు. ఈ ఉదయం, పాకిస్తాన్ రాజౌరి పట్టణంపై షెల్ దాడి చేసింది, అదనపు జిల్లా అభివృద్ధి కమిషనర్ రాజ్ కుమార్ థాపా మరణించారు, పౌరుల ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పాల్గొని మరిన్ని విషయాలు వెల్లడించారు.

పాక్ రక్షణ సదుపాయాలపై విస్తృత దాడులు
రఫీకి, మురిద్, చక్లాలా, రహీమ్ యార్ ఖాన్లోని పాకిస్తాన్ వైమానిక దళ స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. సుక్కూర్, చునియాలోని పాకిస్తాన్ సైనిక స్థావరాలు, పస్రూర్లోని రాడార్ సైట్, సియాల్కోట్ విమానయాన స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. భారతదేశ పశ్చిమ సరిహద్దులో చేపట్టే చర్యలతో భారత్ను పాక్ రెచ్చగొడుతోందని అన్నారు. పౌర ప్రాంతాలు, సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్తాన్ మానవరహిత యుద్ధ వైమానిక వాహనాలు, క్షిపణులు, ఫైటర్ జెట్లను ఉపయోగించిందని తెలిపారు. “భారత సాయుధ దళాలు వీటిని చాలావరకు అడ్డుకున్నాయి. అయితే, ఉధంపూర్, పఠాన్కోట్, అడంపూర్, భుజ్లోని భారత వైమానిక దళ స్టేషన్లలోని పరికరాలు, సిబ్బందికి పరిమిత నష్టం వాటిల్లింది” అని వారు పేర్కొన్నారు. ఇండియాలో ఎయిర్ బేస్లను ధ్వంసం చేసినట్లు పాకిస్థాన్ అబద్ధాలు ప్రచారం చేస్తుందని అని అన్నారు. పాక్ ప్రచార ఫేక్ అని కొన్ని ఫొటోలు కూడా చూపించారు.
Read Also: Pakistan :పాకిస్తాన్కు ఐఎంఫ్ నుంచి 100 కోట్ల డాలర్ల విడుదల..