తెలంగాణలోని గ్రూప్-1 పరీక్షలపై మరొకసారి సంచలనం చెలరేగుతోంది. టీజీపీఎస్సీ నిర్వహించిన ఈ పరీక్షల్లో అనేక అనుమానాలు మెుదలయ్యాయి. ముఖ్యంగా కోఠి కళాశాలలో పరీక్ష రాసిన అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు.అయన పేర్కొన్న ప్రకారం, కోఠి కళాశాలలోని 18, 19వ సెంటర్లలో 1,490 మంది పరీక్ష రాయగా, అందులో 74 మంది ఎంపికయ్యారట. అదే సమయంలో, ఇతర 25 సెంటర్లలో దాదాపు 10,000 మంది రాయగా, కేవలం 69 మందికే ఎంపిక లభించింది. ఇది న్యాయమైనదేనా అని ఆయన ప్రశ్నించారు.కౌశిక్ రెడ్డి మరో ఆసక్తికర విషయం బయటపెట్టారు. మొత్తం 654 మందికి ఒకే విధమైన స్కోరు ఎలా వచ్చిందో తేల్చాలని డిమాండ్ చేశారు. ఇది సాధ్యమేనా? లేదా అంతా ముందుగానే ప్లాన్ చేయబడ్డ స్క్రిప్టేనా? అని ప్రజలమధ్య అనుమానాలు చెలరేగుతున్నాయి.

CBI విచారణకే తుది తీర్పు కావాలి
ఈ పరీక్షల్లో అవకతవకలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొంటూ, కేంద్ర సంస్థ అయిన సీబీఐ చేత విచారణ జరిపించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అంతేగాక, ప్రిలిమ్స్, మెయిన్స్కు వేర్వేరు హాల్ టిక్కెట్లు ఎందుకు జారీ చేశారని అడిగారు. ఇది పూర్తిగా అనుమానాస్పదమని వ్యాఖ్యానించారు.అసలు సంచలనాత్మకంగా మారిన విషయం ఏంటంటే—ఒక ప్రముఖ కాంగ్రెస్ నాయకుడి కోడలికి ఎస్టీ కేటగిరీలో ఫస్ట్ ర్యాంకు రావడం. ఆమె కోఠి కళాశాలలోనే పరీక్ష రాయడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఇది కేవలం యాదృచ్ఛికమా లేక పథకప్రకారమా అనే విషయం ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు.
భాషల మధ్య అన్యాయం..?
ఇంకా ఎక్కువ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే—ఉర్దూలో పరీక్ష రాసిన 9 మందిలో 7 మంది ఎంపికయ్యారని, టాప్ 100లో ముగ్గురు ఉన్నారని చెప్పారు. అదే సమయంలో, 8 వేల మంది తెలుగులో రాయగా కేవలం 60 మందికే ఎంపిక లభించిందని, టాప్ 100లో నలుగురు మాత్రమే ఉన్నారని వివరించారు. ఇది భాషా ఆధారంగా వివక్షనా అనే చర్చ మొదలైంది.ఇలాంటి తీవ్రమైన ఆరోపణల మధ్య బీజేపీ నాయకులు మౌనంగా ఉండడాన్ని కూడా కౌశిక్ రెడ్డి తప్పుపట్టారు. ఈ అంశంపై బీజేపీ ఎందుకు స్పందించదని నిలదీశారు.
పేపర్ లీక్ అయితే ఎందుకు రద్దు కావడం లేదు?
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేపర్ లీక్ జరిగినప్పుడు పరీక్షను రద్దు చేశామని గుర్తు చేశారు. మరి ఇప్పుడు ఇదే పరిస్థితి కనబడుతున్నా, కాంగ్రెస్ నేతలు ఎందుకు ఏ చర్య తీసుకోవడం లేదని ప్రశ్నించారు.ఇక ప్రజలు ఈ అనుమానాలపై స్పష్టత కోరుతున్నారు. నిజంగా న్యాయంగా ఎంపిక జరిగిందా? లేక రాజకీయ నెపథ్యాలు ఉన్నాయా? అన్నదానిపై సమాధానాలు రావాల్సిన సమయం ఆసన్నమైందనే చెప్పాలి.
Read Also : రేపు కాంగ్రెస్ సీఎల్పీ మీటింగ్.. నాలుగు అంశాలపై చర్చ!