ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పీ-4 పథకంను మరింత సమర్థవంతంగా అమలు చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కీలక నిర్ణయం తీసుకున్నారు. అమలు పర్యవేక్షణ కోసం రెండు ప్రత్యేక కమిటీలను (Two special committees) ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక ఛాప్టర్లు ఏర్పాటుచేయాలన్న సూచనలను కూడా జారీ చేశారు.జులై 4వ తేదీన సీఎం చంద్రబాబు వెలగపూడి సచివాలయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో పీ-4 భవిష్యత్తు కార్యాచరణపై చర్చ జరిగింది. పథకం విజయవంతంగా సాగేందుకు ఇన్ఛార్జ్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులు ఈ కమిటీల్లో భాగం కానున్నారు.

పీ-4 లోగోను ఖరారు చేసిన సీఎం
పీ-4 పథకానికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చేలా లోగోను కూడా సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పథకం స్పష్టతను పెంచేలా ఈ లోగో ఉపయోగపడనుంది.ఆగస్టు 15వ తేదీ నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలు, లక్ష మందికి పైగా మార్గదర్శకులు గుర్తింపు పొందేలా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ దిశగా చర్యలు వేగంగా సాగుతున్నాయి.పీ-4 అమలులో బాపట్ల జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని సీఎం వెల్లడించారు. ఇతర జిల్లాలు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
సందేహాలపై స్పష్టత
పీ-4 పథకం వల్ల సంక్షేమంలో కోతలు వస్తాయనే అపోహలు ప్రజల్లో ఉన్నాయని ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో తెలిపారు. వాటిపై స్పందించిన చంద్రబాబు, ఇది సంక్షేమానికి పోటీ కాదని, అదనంగా మద్దతుగా ఉండే పథకమని స్పష్టం చేశారు.బంగారు కుటుంబాలకు సమయానికి సహాయం అందించడంలో మార్గదర్శకుల పాత్ర కీలకం అవుతుందని సీఎం చెప్పారు. మార్గనిర్దేశకులు ప్రజలతో నిత్యం సంబంధం ఉంచుతూ, ఎటువంటి సందేహాలకైనా పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని చెప్పారు.
స్వర్ణాంధ్ర పీ-4 ఫౌండేషన్ తొలి సమావేశం
ఈ రోజు జరిగిన స్వర్ణాంధ్ర పీ-4 ఫౌండేషన్ తొలి జనరల్ బాడీ సమావేశం చాలా ప్రాముఖ్యత కలిగినదిగా మారింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా, మండల స్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం జూమ్ వేదికగా జరిగింది.
Read Also : Chandrababu : జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పై టీపీసీసీ ఆగ్రహం