న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిశీ గోవాలో మీడియాతో మాట్లాడుతూ.. గోవా, గుజరాత్లలో తాము సొంతంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నామని వెల్లడించారు. కూటమిగా పోటీ చేయడంపై ఇప్పటి వరకు ఎవరితోనూ చర్చించలేదన్నారు. గుజరాత్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సహా ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని, తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని తెలిపారు. తమ పార్టీ నుండి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిస్తే, వారు రెండు నెలలు కూడా ప్రతిపక్షంలో ఉండరని ప్రచారం చేశారని, కానీ వారు ఇప్పటికీ పార్టీలోనే ఉన్నారని పేర్కొన్నారు.

రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదించాలనుకోలేదు
2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోవాలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ నుండి గెలిచిన 11 మందిలో ఎనిమిది మంది బీజేపీలో చేరారని ఆమె గుర్తు చేశారు. రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదించాలనుకోలేదు కాబట్టే వారు ఇప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీలోనే ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన 11 మందిలో ఎనిమిది మంది బీజేపీలో చేరాక, ఇంకా భావసారూప్యత ఎక్కడుందని ప్రశ్నించారు. బీజేపీ తమ ఎమ్మెల్యేలను కూడా ఆకర్షించినప్పటికీ వారు పార్టీ మారలేదని అన్నారు. ఎందుకంటే, తమకు రాజకీయాలంటే ప్రజాసేవ అని ఆమె వ్యాఖ్యానించారు.
ప్రజలకు ఏం జరుగుతుందనేదే ముఖ్యం
ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతే విద్యుత్ కోతలు మొదలవుతాయని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఉండదని కేజ్రీవాల్ ముందే హెచ్చరించారని గుర్తు చేశారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిపై అతిశీ స్పందిస్తూ, తమ పార్టీకి ఏం జరుగుతుందనే విషయంతో తమకు సంబంధం లేదని, ప్రజలకు ఏం జరుగుతుందనేదే ముఖ్యమని అన్నారు. అధికారంలోకి వచ్చాక 250 మొహల్లా క్లినిక్లను మూసివేస్తామని బీజేపీ ప్రకటించిందని, ఉచిత మందులను కూడా నిలిపివేస్తామని చెబుతోందని అన్నారు.