Ponnam Prabhakar: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ప్రస్తుతం సభలో 56 శాతం బలహీన వర్గాలకు సంబంధించిన అంశంపై మాట్లాడే సందర్భంగా ప్రతిపక్షం తరఫున సభలో నలుగురు కూడా లేరు. ఈ క్రమంలోనే మంత్రి మాట్లాడుతూ.. ప్రతిపక్షానికి బాధ్యత లేదు.. బలహీన వర్గాల పట్ల శ్రద్ధ లేదని అన్నారు. బలహీన వర్గాలకు న్యాయం జరగాలని ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా అన్నీ కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

పార్టీ అధ్యక్ష పదవి బలహీన వర్గాలకు ఇవ్వండి
ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అన్నీ వారి సామాజిక వర్గమే. పార్టీ అధ్యక్ష పదవి బలహీన వర్గాలకు ఇవ్వండి. మేం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్ష పదవి ఒక్కో వర్గానికి ఇచ్చి సామాజిక న్యాయం పాటించాం. మేం చేసిన కులగణన వల్ల 5 ఎమ్మెల్సీ స్థానాలను కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వాల్సి వచ్చింది. మీరు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ బీసీకి ఇవ్వాల్సి వచ్చింది. 42 శాతం రిజర్వేషన్ల చట్టాన్ని కేంద్రంలో అమలు చేసి తీసుకొచ్చే బాధ్యత బీజేపీ సభ్యులపై ఉంది. మహేశ్వర్రెడ్డి దిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకుపోవాలి అని పొన్నం సూచించారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ పద్దులను శాసనసభ ఆమోదించింది.