Operation Sindoor : భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ గురించిన వివరాలను విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పాల్గొని మీడియాతో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా కచ్చితమైన ప్రణాళికతో భారత్ 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్లు వారు స్పష్టం చేశారు. మొత్తం 21 ఉగ్రశిబిరాలను గుర్తించిన ప్రభుత్వం, వాటిలో 9 టార్గెట్ కేంద్రాలపై మెరుపుదాడులు చేసింది.ఈ ఉగ్రదాడుల వెనక ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)’ అనే ఉగ్రసంస్థ ఉందని, ఇది లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి నిషేధిత ఉగ్రసంస్థలకు సంబంధించిన బ్రాంచ్గా పనిచేస్తోందని అధికారులు వివరించారు. పహల్గాం దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యుల కళ్లముందే ముష్కరులు నరహత్యలు జరిపారు. ఈ ఘోర ఘటన పట్ల దేశవ్యాప్తంగా ఆవేదన వ్యక్తమవుతోంది.విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ, “సీమాంతర ఉగ్రవాదంపై పోరాటం భారత్ హక్కు. పాకిస్తాన్ మద్దతుతో TRF పని చేస్తోంది. మేము కేవలం ఉగ్ర శిబిరాలపైనే దాడులు చేశాం. పాకిస్తాన్ పౌరులకు హాని కలిగించకుండా అత్యంత ఖచ్చితంగా ఈ ఆపరేషన్ జరిపాం,” అని పేర్కొన్నారు.
Operation Sindoor : ఆపరేషన్ సింధూర్ మరియు దాని విజయవంతత
ఆపరేషన్ సింధూర్ మే 6-7 అర్ధరాత్రి 1:05 నుండి 1:30 గంటల మధ్య జరిగిందని తెలిపారు. పాక్ భూభాగంలోనే కాకుండా పీఓకేలో ఉన్న ఉగ్ర శిబిరాలపై కూడా దాడులు జరిగాయి. ముఖ్యంగా లాహోర్కు 40 కి.మీ దూరంలో ఉన్న మురిద్కే ప్రాంతంలోని లష్కరే తోయిబా శిబిరాన్ని టార్గెట్ చేయడం విశేషం. ఇదే శిబిరంలో 26/11 ముంబయి దాడులకు పాల్పడిన అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ వంటి ఉగ్రవాదులు శిక్షణ పొందారని కర్నల్ సోఫియా ఖురేషి వెల్లడించారు.ఈ మీడియా సమావేశంలో గతంలో భారత్ చేపట్టిన దాడుల వీడియోలను ప్రదర్శించారు. అంతేకాక, ఈ సారి చరిత్రలో తొలిసారి మహిళా మిలిటరీ అధికారులు మీడియా సమావేశంలో పాల్గొని ఆపరేషన్ వివరాలు వెల్లడించడం విశేషం. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కర్నల్ ఖురేషి చూపించిన ధైర్యం దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది.ఈ దాడుల వివరాలన్నింటిని మీడియా సమక్షంలో వీడియో రూపంలో కూడా ప్రదర్శించారు. పహల్గాం ఘటన మృతులకు న్యాయం చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్, భారత్ ఉగ్రవాదంపై దృఢ సంకల్పాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.
Read More : Karre Gutta : కర్రెగుట్టలో ఎన్కౌంటర్: 22 మంది మావోయిస్టులు హతం