జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మహిళలకు శుభవార్త చెప్పారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ రంగ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయం మహిళల ప్రయాణ ఖర్చును తగ్గించడమే కాకుండా, వారి రోజువారీ జీవన శైలిని మరింత సులభతరం చేస్తుందని సీఎం పేర్కొన్నారు.ఈ నిర్ణయంతో విద్య, ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం రోజూ బస్సుల్లో ప్రయాణించే లక్షలాది మంది మహిళలకు మేలు జరుగనుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి నగరాలకు పని కోసం వెళ్లే మహిళలకు ఇది గొప్ప అవకాశంగా మారనుంది. మహిళలు మరింత స్వేచ్ఛగా, భయపడకుండా ప్రయాణించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న ఒమర్ అబ్దుల్లా మాటలు మహిళలకు భరోసా కలిగించాయి.
ఉచిత ప్రయాణం
ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాలు మహిళల కోసం ఉచిత ప్రయాణ విధానాన్ని అమలు చేస్తుండగా, జమ్మూకశ్మీర్ కూడా అదే బాటలో అడుగులు వేయడం ప్రజల్లో ఉత్సాహాన్ని కలిగిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జమ్మూకశ్మీర్లో మహిళల సంఖ్య సుమారు 59 లక్షలు. గడిచిన 14 ఏళ్లలో ఈ సంఖ్య మరింత పెరిగిందని, రాష్ట్రంలో మహిళలు విద్య, ఉపాధి రంగాల్లో ముందుకు సాగుతున్నారని లెక్కలు తెలియజేస్తున్నాయి.

ప్రభుత్వ రంగ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలులోకి వస్తే మహిళలపై కుటుంబాల ఆర్థిక భారం తగ్గుతుందని, మహిళా సాధికారితకు దోహదపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా నిత్యం స్కూల్, కాలేజీలకు వెళ్లే విద్యార్థినులు, ఉద్యోగులుగా పనిచేస్తున్న మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోనున్నారు.మొత్తానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం ఒమర్ అబ్దుల్లా చేసిన ఈ ప్రకటన జమ్మూకశ్మీర్ మహిళలకు సంతోషకరమైన వార్త. ప్రభుత్వ రంగ బస్సుల్లో ఉచిత ప్రయాణ విధానం త్వరలోనే అమలులోకి రానుండటంతో,మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.స్థానిక మహిళలు, విద్యార్థినులు ఈ నిర్ణయానికి బలమైన మద్దతు తెలుపుతూ, శ్రీనగర్కు చెందిన విద్యార్థిని అంజూమ్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, “చాలా మంది విద్యార్థులు కాలేజీకి వెళ్ళడానికి చాలా దూరంప్రయాణించాలి, రవాణా ఖర్చు భారీగా పెరుగుతుంది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల నేను ప్రయాణ ఖర్చు గురించి ఆలోచించకుండా చదువుపై పూర్తిగా దృష్టి పెట్టగలను” అని పేర్కొన్నారు.