TGPSC : తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 29 చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జీవో 29 చెల్లుబాటును సవాల్ చేస్తూ గ్రూప్-1 అభ్యర్థులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్ను కొట్టి వేసింది. దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో జారీ చేసిన జీవో 55కు సవరణ తీసుకొస్తూ ఫిబ్రవరి 8న తెలంగాణ ప్రభుత్వం జీవో 29ని జారీ చేసింది.

త్వరలో 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలన
దీనిని రద్దు చేయాలని కోరుతూ గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. తాజాగా పిటిషన్ కొట్టివేతతో గ్రూప్-1 నియామకాలకు అడ్డంకి తొలగినట్లు అయింది. ఇప్పటికే టీజీపీఎస్సీ గ్రూప్ -1 జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది. త్వరలో 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలన చేయనుంది.
మార్చి 30న విడుదల చేసిన గ్రూప్-1 జీఆర్ఎల్ జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది.
టీజీపీఎస్సీ వెబ్సైట్లో తమ ర్యాంకులను చూసుకోవచ్చు
గ్రూప్-1 పరీక్ష రాసిన అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్సైట్లో తమ ర్యాంకులను చూసుకోవచ్చు. మార్చి 10న గ్రూప్-1 ప్రొవిజినల్ మార్కులు విడుదల చేసిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబరులో ఈ గ్రూప్ పరీక్షల జరిగిన విషయం విధితమే. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో మహిళలు టాప్ 10లో ఆరుగురు ఉన్నారు. 550 మార్కులతో తొలి స్థానంతో పాటు మొదటి పది ర్యాంకులు సాధించారు. మొత్తం 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు పరీక్షలు జరగ్గా, అర్హత సాధించిన 12,622 మంది ర్యాంకులను టీజీపీఎస్సీ మార్చి 30న విడుదల చేసింది.