న్యూఢిల్లీ: ఢిల్లీలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం ఉదయం ఈస్ట్ ఢిల్లీ, నోయిడాలోని పలు స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్ ద్వారా వార్నింగ్ రావడంతో ముందుజాగ్రత్తగా స్కూళ్లను మూసివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్ సిబ్బంది స్కూళ్లలో తనిఖీలు చేశారు. అనంతరం అనుమానాస్పద వస్తువులేవీ లేవని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. మయూర్ విహార్లోని అహ్లాకాన్ ఇంటర్నేషనల్ స్కూల్కు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు ప్రిన్సిపల్ పాండవ్ నగర్ పోలీస్ స్టేషన్కు టెలిఫోన్ ద్వారా తెలియజేశారని వెల్లడించారు.

అంతేకాక.. నోయిదాలోని శివ్ నాడార్ స్కూల్కు బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు. బాంబ్ స్క్వాడ్, ఫైర్ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ స్కూల్లో తనిఖీలు చేస్తున్నారని వెల్లడించారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయమై సైబర్ టీమ్ దర్యాప్తు చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి గాలివార్తలను నమ్మొద్దని నోయిడా పోలీసులు సూచించారు.
ఇకపోతే..ఢిల్లీలోని స్కూళ్లకు గతకొన్ని రోజులుగా బాంబు బెదిరింపులు రావడం నిత్యకృత్యంగా మారిన విషయం తెలిసిందే. గత నెల 10న స్కూళ్లకు బెదింపుల వెనక ఉన్న దొంగను పోలీసులు పట్టుకున్నారు. ఓ మైనర్ విద్యార్థి.. తన స్కూల్ పరీక్షలను తప్పించుకునేందుకు ఆ బెదిరింపులు చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనలో 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని కస్టడీలోకి తీసుకున్నారు.