ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఈనెల 10న “మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (PTM) 2.0″ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో 2.28 కోట్ల మందిని పాల్గొనింపజేసే లక్ష్యంతో గిన్నిస్ వరల్డ్ రికార్డుకు దరఖాస్తు చేయనున్నారు. సమగ్ర శిక్షా పథక రాష్ట్ర సంచాలకుడు బి. శ్రీనివాసరావు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు దోహదపడే ప్రయత్నమేనని, రికార్డు కోసం మాత్రమే “విట్నెస్”ల సంతకాలు సేకరిస్తున్నామని స్పష్టం చేశారు.
అపోహలు వీడాలని టీచర్లకు సూచన
విట్నెస్ సంతకాల నేపథ్యంలో కొన్ని అపోహలు వెలువడుతున్న నేపథ్యంలో, ముఖ్యోపాధ్యాయులు (HMలు), టీచర్లు అసత్య ప్రచారాలు నమ్మవద్దని శ్రీనివాసరావు కోరారు. ఈ కార్యక్రమం గిన్నిస్ రికార్డు కోణంలో నిర్వహిస్తున్నప్పటికీ, దీని వెనుక ఎటువంటి వ్యక్తిగత ప్రయోజనాలు లేవని అన్నారు. ప్రభుత్వం కోరుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, తప్పుడు వార్తల ప్రచారాన్ని నివారించాలని కోరారు.
విట్నెస్ కోసం ఎవరి సంతకమైనా చెల్లుబాటు
విట్నెస్గా సంతకం చేయాల్సింది ప్రభుత్వ ఉద్యోగులు లేదా పేరెంట్స్ మాత్రమే కాదని, కార్యక్రమానికి హాజరైన ఎవరైనా వ్యక్తులు సంతకం చేయవచ్చని బి. శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మెగా PTM ద్వారా విద్యార్థుల విద్యాప్రగతిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడమే అసలైన ఉద్దేశమని, ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు, టీచర్లు, పేరెంట్స్ అంతా కలిసి విద్యారంగాన్ని బలోపేతం చేయాలని విద్యాశాఖ ఆకాంక్షిస్తోంది.
Read Also : YCP : వంశీని కలిసిన పేర్ని నాని , కొడాలి నాని