తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖకు సంబంధించిన కీలక మార్పు జరగనుంది. ప్రస్తుత డీజీపీ జితేందర్ ఈ ఏడాది సెప్టెంబర్లో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో వచ్చే నెలలలో కొత్త డీజీపీ ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా కసరత్తు ప్రారంభించింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం, డీజీపీ పదవికి అర్హులైన వారిలో 30ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారినే పరిశీలించాల్సి ఉంటుంది.
పలువురు పోలీస్ అధికారుల పేర్లు పరిశీలనలో
ఈ ప్రామాణికానికి అనుగుణంగా ఏడుగురు అగ్రశ్రేణి పోలీస్ అధికారుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీరిలో రవిగుప్తా, సీవీ ఆనంద్, శివధర్రెడ్డి, సౌమ్యామిశ్రా, షికా గోయల్ వంటి అనుభవజ్ఞులైన అధికారులు ముందువరుసలో ఉన్నారు. వారందరూ విభిన్న విభాగాల్లో సేవలందించిన వారు కావడంతో, ఎవరు కొత్త డీజీపీ అవుతారనే ఆసక్తి మరింత పెరిగింది.

UPSC ఎంపిక
ఈ ఏడుగురి జాబితాలో నుండి ముగ్గురు అధికారుల పేర్లను UPSC ఎంపిక చేయనుంది. ఆ ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమించనుంది. ఇది ఒక రాజకీయ, పరిపాలనా పరమైన కీలక నిర్ణయం కావడంతో, అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎవరు వచ్చే డీజీపీగా బాధ్యతలు స్వీకరిస్తారో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.