పుదుచ్చేరిలోని ఓ సామాన్య యువకుడు విక్రమ్ (33) ప్రైవేట్ అప్పుల వడ్డీ భారం తాళలేక ఆత్మహత్య (Youth Suicide) ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కుటుంబ పోషణ కోసం చికెన్ షాప్లో పనిచేస్తూ, చిన్న వ్యాపారం కొనసాగిస్తున్న విక్రమ్ ఇటీవల జరిగిన ప్రమాదంతో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమయ్యాడు. ఉపాధి కోల్పోయిన అతడు తనకు ఉన్న అప్పులు తీర్చలేక తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు.
చావుకు కారణమైన వాళ్ల పేర్లు సూసైడ్ నోట్లో వెల్లడి
విక్రమ్ రూ. 3.8 లక్షల అప్పుపై నెలకు రూ.38,000 వడ్డీ చెల్లించాల్సిన స్థితిలో ఉన్నాడు. అంటే నెలకు 10% వడ్డీ వసూలు చేస్తున్నారు. అదనంగా రూ.30,000 కోసం రూ.6,000 వడ్డీ డిమాండ్ చేసిన ఫైనాన్షియర్లు, అప్పు తీర్చే వరకు భార్య, కుమార్తెను పంపించాలంటూ నీచంగా వేధించినట్లు సూసైడ్ నోట్లో వెల్లడించారు. విక్రమ్ ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) లో కార్యకర్తగా పని చేస్తుండడం, తన కుటుంబ బాధ్యతలు చూసుకోవాలని విజయ్ను కోరుతూ రాసిన లేఖ భావోద్వేగానికి లోను చేస్తోంది.
కఠిన చర్యలకు డిమాండ్
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. స్థానికంగా అక్రమ వడ్డీ వ్యాపారులపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతోంది. పుదుచ్చేరి సహా తమిళనాడు కొన్ని ప్రాంతాల్లో ఈ తరహా అక్రమ రుణ ప్రవర్తన కొనసాగుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దోషులను కఠినంగా శిక్షించి, బాధిత విక్రమ్ కుటుంబానికి న్యాయం చేయాలని సామాజిక కార్యకర్తలు, స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆత్మపరిశీలనకు దారి తీసేలా మారాల్సిన అవసరం ఉంది.
Read Also : TTD : టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ముగ్గురికి బెయిల్