తమిళ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ (Vijay) రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత తొలి అడుగులే దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. తాజాగా ఆయన తిరుచ్చిరాపల్లిలో తన పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం అక్కడి ప్రజల్లో ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, రాజకీయ వర్గాల్లోనూ విస్తృత చర్చకు దారితీసింది.
విజయ్ స్పష్టంగా ప్రకటించిన విషయం ఏమిటంటే – ప్రజలను మోసం చేసే, వారిని హింసించే ఎవరినీ విడిచిపెట్టబోమని. ఈ మాటల ద్వారా ఆయన ప్రజల సమస్యలను పట్టించుకోని పాలకులను గట్టిగా ప్రశ్నించారు. ముఖ్యంగా, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ), తమిళనాడు (Tamil Nadu) లో అధికారంలో ఉన్న ద్రవిడ మున్నేత్ర కళగం (డీఎంకే) ప్రభుత్వాలపై ఆయన విరుచుకుపడ్డారు. రెండు పార్టీలు కేవలం అధికార దాహంతోనే పని చేస్తూ, ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని విజయ్ ఆరోపించారు.
భవిష్యత్తులో పెద్ద మార్పులకు దారితీసే మలుపు
తన ప్రసంగంలో విజయ్ ఒక ముఖ్యమైన విషయం ప్రస్తావించారు. “తిరుచ్చిరాపల్లి (Tiruchirappalli) ని సందర్శించడం కేవలం ఒక ప్రారంభం మాత్రమే కాదు. ఇది భవిష్యత్తులో పెద్ద మార్పులకు దారితీసే మలుపు అవుతుంది” అని ధీమాగా చెప్పారు. ఈ వ్యాఖ్యలతో ఆయన తన రాజకీయ యాత్రను దీర్ఘకాలం కొనసాగించే ఉద్దేశ్యం ఉన్నట్లు స్పష్టమైంది. ఆయన అనుచరులు, అభిమానులు ఈ మాటలను వినగానే భారీగా హర్షధ్వానాలు చేశారు.

పునర్విభజన పేరుతో
అలాగే,కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న “ఒకే దేశం – ఒకే ఎన్నిక” విధానాన్ని (“One Nation – One Election” policy) విజయ్ తీవ్రంగా వ్యతిరేకించారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ బలాన్ని తగ్గించేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. విద్య, విపత్తుల సహాయ నిధులు వంటి కీలక రంగాలకు కేంద్రం తగిన నిధులు మంజూరు చేయకుండా తమిళనాడుకు అన్యాయం చేస్తోందని ఆయన అన్నారు.
అదే సమయంలో హిందీ భాష (Hindi language) ను రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు.ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గురించి విజయ్ మాట్లాడుతూ.. డీఎంకే పార్టీ స్వయంగా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో డీఎంకే విఫలమైందని అన్నారు. “తాను డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజాసేవే తన లక్ష్యమని,” విజయ్ మరో సభలో స్పష్టం చేశారు.
సాంకేతిక లోపం
విజయ్ తొలి ప్రచార సభలో సాంకేతిక లోపం చోటుచేసుకుంది. దాదాపు 20 నిమిషాల పాటు ప్రసంగించినప్పటికీ, మైక్ సరిగా పని చేయకపోవడంతో అభిమానులు ఆయన మాటలను పూర్తిగా వినలేకపోయారు. కేవలం రెండు, మూడు నిమిషాల ప్రసంగం మాత్రమే స్పష్టంగా వినిపించింది. అయినప్పటికీ వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు కార్యక్రమానికి హాజరయ్యారు. “విజయ్, విజయ్!” అంటూ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: