Vice President : ఉపరాష్ట్రపతి ఎన్నికలు రాజ్యాంగ పరిరక్షకులకు, రాజ్యాంగ వ్యతి రేకులకు మధ్య జరుగుతున్న పోరు అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI National Secretary Narayana) అన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రజాస్వామ్య పరిరక్షకుడని కొనియాడారు. ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద నారాయణ మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీల కూటమి నుంచి ఉపరాష్ట్ర పతి అభ్యర్థిగా ఎంపిక చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి కింది స్థాయి నుండి సుప్రీం కోర్టు. న్యాయమూర్తిగా, అభ్యుదయ వాదిగా, రాజ్యాంగ ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా పేరు గడించిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ప్రతిపాదించిన వెంటనే ఎన్డీఏ కూటమిలో తీవ్రమైనటువంటి భయం, వణుకు నెలకొందన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని మావోయిస్టు అంటూ వ్యాఖ్యానించడాన్ని నారాయణ తప్పు పట్టారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి పట్ల బిజెపిలోని భయాన్ని వ్యక్తం చేస్తున్నదని చెప్పారు. ఆపరేషన్ కగార్ పేరుతో సుదర్శన్ రెడ్డిని అంతమొందిస్తారా అంటూ అమిత్ షా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఇప్పటిదాకా ఉపరాష్ట్ర పతిగా ఉన్న జగదీప్ ధనకర్ ఏమైపోయారో, అసలు ఉన్నారో లేరో కూడా అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి విపక్షాల మద్దతు
బిజెపికి వ్యతిరేకంగా ఉన్నందునే జగదీప్ ధన్కర్ ను అర్ధాంతరంగా ఆ పదవి నుండి వైదొలిగేలా చేశారని విమర్శించారు. ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో విపక్ష పార్టీలన్నీ కలిసి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించామని, ఆయన అభ్యర్థిత్వానికి భారత కమ్యూనిస్టు పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని స్పష్టం చేశారు. సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఇండియా కూటమికి దూరంగా ఉన్న ఆద్మీ పార్టీ కూడా స్వాగతించిందన్నారు. రాజ్యాంగ రక్షణ కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పనిచేసే ఆయన్ని గెలిపించుకోవడం చాలా అవసరమన్నారు. ఏపీ లో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రతిపక్షనేత జగన్ ఈ విషయంలో ఆలోచించాలని, తెలుగువాడైన సుదర్శన రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలిపిన అభ్యర్థి అంటూ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. తెలుగువాడైన జస్టిస్ సుదర్శనరెడ్డికి తెలుగు రాష్ట్రాల్లోని అన్నీ పార్టీలు తమ రాజకీయాలను పక్కన పెట్టి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ ఎన్నికల్లో బిజెపిని ఓడించడం ద్వారానే దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవల్సిన అవసరం ఉందన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :