మే 2న తెరుచుకోనున్న కేదార్నాథ్ ఆలయం
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఛార్ధామ్ యాత్రకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. ఏప్రిల్ 30 నుంచి ఛార్ధామ్ యాత్ర ప్రారంభమవుతుందని పేర్కొంది. మహాశివరాత్రి సందర్భంగా ఓంకారేశ్వర్ ఆలయంలోని కేదార్నాథుడికి పూజల అనంతరం ఆధ్యాత్మిక గురువు, వేద పండితులు ఛార్ధామ్ యాత్ర తేదీలను నిర్ణయించారు. ఈ వివరాలను బద్రీనాథ్- కేదార్నాథ్ ఆలయ కమిటీ సీఈఓ విజయ్ ప్రసాద్ తప్లియాల్ వెల్లడించారు. ఏప్రిల్ 30న అక్షయ తృతీయ రోజున యమునోత్రి, గంగోత్రి ఆలయాలు తెరుచుకోనున్నాయని చెప్పారు. అనంతరం కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను తెరవనున్నట్టు పేర్కొన్నారు.

ఉఖీమఠ్లో కేదారనాథుడికి పూజలు
మే 2న కేదార్నాథ్ ఆలయం, మే 4న బద్రీనాథ్ ఆలయాలను తెరుస్తారు. హిమాలయాల్లోని ఉండే ఈ ఆలయాలు ఆరు నెలల మాత్రమే తెరిచి ఉంటాయి. శీతల వాతావరణం వల్ల మిగతా ఆరు నెలల ఆలయాలను మూసివేస్తారన్న విషయం తెలిసిందే. గతేడాది నవంబరు 3న కేదార్నాథ్ ఆలయాన్ని మూసివేశారు. ఈ ఏడాది భక్తుల దర్శనార్థం మే 2 ఉదయం 7 గంటల నుంచి ఆలయం తెరుస్తున్నట్లు విజయ్ ప్రసాద్ తప్లియాల్ తెలిపారు. కేదార్నాథ్ ఆలయాన్ని మూసివేసిన తర్వాత దిగువ ఉండే ఓంకారేశ్వర ఆలయ ఉఖీమఠ్లో కేదారనాథుడికి పూజలు నిర్వహిస్తారు.
ఏప్రిల్ 30న ప్రారంభం కానున్న యమునోత్రి, గంగోత్రి
ఏప్రిల్ 28న పంచముఖి డోలీ ఉత్సవం నిర్వహించి, కేదార్నాథుడ్ని ఉఖీమఠ్ నుంచి కేదార్నాథ్కు తరలించనున్నట్టు ఆలయ కమిటీ సీఈఓ తెలిపారు. దీనికి ముందు రోజు అంటే ఏప్రిల్ 27న భైరవనాథ్ పూజ నిర్వహిస్తారు. ఏప్రిల్ 28న ఉఖీమఠ్ నుంచి బయలుదేరిన తర్వాత ఆ రోజు రాత్రికి గుప్త కాశీలోని విశ్వనాథ్ ఆలయంలో కేదారేశ్వరుడు విడిది చేయనున్నాడు. మర్నాడు ఉదయం మళ్లీ అక్కడ నుంచి ప్రయాణం మొదలై ఏప్రిల్ 30న గౌరీకుండ్కు చేరుతుంది. ఆ రోజు రాత్రి గౌరీ దేవి ఆలయంలో విగ్రహాన్ని ఉంచి పూజలు చేస్తారు. తిరిగి మే 1 ఉదయం మొదలుపెట్టి అదే రోజు సాయంత్రానికి కేదార్నాథ్ చేరుతుంది. ద్వాదశ జ్యోతిర్లాంగాలో ఒకటైన కేదార్నాథ్.. శివుడి కొలువున్న పంచక్షేత్రాల్లో అతి ముఖ్యమైంది.