ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ‘వందేమాతరం’ (Vande Mataram) గీతంపై తన ఆత్మీయ అనుబంధాన్ని పంచుకున్నారు. శుక్రవారం పార్లమెంటు వెలుపల ఆమె మాట్లాడుతూ, తాను చిన్నతనంలో ఈ గీతాన్ని ఎంతో ఆస్వాదించానని గుర్తుచేసుకున్నారు.
Read Also: Mohammed Moquim: ప్రియాంక కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలి మాజీ ఎమ్మెల్యే డిమాండ్
భావితరాలు కూడా ఈ గీతంతో మమేకమై, దేశం పట్ల గర్వపడాలని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వందేమాతరం గీతంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్న నేపథ్యంలో సుధామూర్తి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
భారతావనిని కలిపి ఉంచే దారం వందేమాతరం
అంతకుముందు రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చలో పాల్గొన్న సుధామూర్తి, కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల పాఠ్యాంశాల్లో వందేమాతరాన్ని తప్పనిసరి చేయాలని ఆమె కోరారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడానికి, మన సాంస్కృతిక స్మృతిని కాపాడటానికి ఇది అత్యంత అవసరమని ఆమె నొక్కి చెప్పారు.
ఈ సందర్భంగా ఆమె ఒక అద్భుతమైన పోలికను ప్రస్తావిస్తూ, “భారతదేశం విభిన్న రంగులతో కూడిన ఒక అందమైన దుప్పటి వంటిది. ఆ భిన్నత్వాన్ని కలిపి ఉంచే దారం, సూది వందేమాతరం” అని అభివర్ణించారు.

స్వాతంత్ర్య పోరాటంలో అగ్నిపర్వతం
స్వాతంత్ర్య పోరాటంలో ఈ గీతం పోషించిన కీలక పాత్రను సుధామూర్తి (Sudha Murthy) సభకు గుర్తుచేశారు. ప్రజలు ఆత్మవిశ్వాసం కోల్పోయిన క్లిష్ట సమయంలో ‘వందేమాతరం’ ఒక అగ్నిపర్వతంలా విస్ఫోటనం చెందిందని, పిరికివారిని సైతం నిలబెట్టి పోరాడే శక్తిని అందించిందని వివరించారు.
మనకు స్వాతంత్ర్యం వెండి పళ్లెంలో పెట్టి ఎవరూ ఇవ్వలేదని, ఎందరో మహానుభావుల త్యాగాలతో ముడిపడి ఉన్న ఆ పోరాటానికి వందేమాతరం నిలువెత్తు సాక్ష్యమని ఆమె ఉద్వేగంగా ప్రసంగించారు.
పార్లమెంటులో రాజకీయ దుమారం
వందేమాతరం గీతాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంటులో చేపట్టిన ప్రత్యేక చర్చ, చివరకు అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. 1937లో ఈ గీతంపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయమే దేశ విభజనకు కారణమైన మతపరమైన ఉద్రిక్తతలకు బీజం వేసిందని బీజేపీ సీనియర్ నేతలు ఆరోపించారు.
అయితే, ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. అధికార పార్టీ చరిత్రను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని, పాత వివాదాలను తవ్వడం మానేసి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని కాంగ్రెస్ నేతలు హితవు పలికారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: