కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య (Siddaramaiah) తనను బహిరంగంగా అవమానించి, చెంపదెబ్బ కొట్టేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ ఓ సీనియర్ పోలీసు అధికారి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)(VRS)కు దరఖాస్తు చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, తన ఆత్మగౌరవం దెబ్బతిన్నదని అదనపు ఎస్పీ (ఏఎస్పీ) ఎన్వీ బరమణి తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
ఏప్రిల్ 28 – బెళగావిలో సభ, బహిరంగ అవమానం
వివరాల్లోకి వెళితే.. ఏప్రిల్ 28న బెళగావిలో కాంగ్రెస్ పార్టీ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఓ నిరసన సభ నిర్వహించింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య (Siddaramaiah) పాల్గొన్న ఈ సభలో వేదిక వద్ద బందోబస్తు విధుల్లో ఏఎస్పీ బరమణి ఉన్నారు. ఈ క్రమంలో కొందరు బీజేపీ మహిళా కార్యకర్తలు సభకు అంతరాయం కలిగించడంతో సీఎం సిద్దరామయ్య తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
పోలీసు అధికారి బరమణి సంచలన ఆరోపణ
వెంటనే వేదికపై ఉన్న బరమణిని(Baramani)పిలిచి ‘హేయ్! ఎవరు ఇక్కడ ఎస్పీ? బయటకు వెళ్లు!’ అని అందరి ముందూ గట్టిగా అరిచినట్టు బరమణి తెలిపారు. అంతటితో ఆగకుండా, తనను చెంపదెబ్బ కొట్టేందుకు చెయ్యి పైకి లేపారని, తాను వెంటనే వెనక్కి జరగడంతో త్రుటిలో ఆ దాడి నుంచి తప్పించుకున్నానని ఆయన వివరించారు. ఈ ఘటన మీడియాలో ప్రసారమవడంతో తీవ్ర అవమానానికి గురయ్యానని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

బీజేపీ & జేడీఎస్ సిద్దరామయ్యపై ఫైరింగ్
“శారీరకంగా దాడి జరగకపోయినా, వేలాది మంది ముందు జరిగిన ఈ అవమానాన్ని నేను తట్టుకోలేకపోయాను. ఈ ఘటన తర్వాత ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. నా భార్యాపిల్లలు గుండెలవిసేలా ఏడ్చారు. 31 ఏళ్లుగా నిజాయితీగా పనిచేసిన నాకు ఇలాంటి అవమానం జరగడం దారుణం” అని బరమణి పేర్కొన్నారు. తనకు న్యాయం జరగనప్పుడు, ఇతరులకు తాను ఎలా న్యాయం చేయగలనని ఆయన ప్రశ్నించారు.
సిద్దరామయ్య బృందం బరమణిని కలిసిన సమాచారం
ఈ విషయంపై ఏఎస్పీ బరమణి జూన్ 14న హోం సెక్రటరీకి లేఖ సమర్పించారు. ప్రభుత్వం ఆయన రాజీనామాపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కాగా, సీఎం సిద్దరామయ్య(Siddaramaiah) తో పాటు పలువురు మంత్రులు బరమణిని కలిసి, తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని కోరినట్టు సమాచారం. మరోవైపు, ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. సీఎం సిద్దరామయ్య అహంకారానికి ఇది నిదర్శనమని బీజేపీ విమర్శించగా, ఆయన హిట్లర్ లాంటి పాలనతో అధికారులు విసిగిపోయారని జేడీఎస్ ఆరోపించింది.
Read Also: Delhi: ఢిల్లీ లో జంట హత్యల కలకలం