కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం (Karnataka State Government) విద్యా సంస్థల్లో కుల, మత, ఆర్థిక ఆధారిత వివక్షను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం రూపొందించేందుకు సిద్ధమైంది. దీనికి “రోహిత్ వేముల చట్టం” అనే పేరు పెట్టనున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు కులవివక్ష కారణమని దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అప్పట్లో రాహుల్ గాంధీ కూడా ఈ విషయంలో స్పందించి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.
బిల్లో ఉన్న ప్రధాన నిబంధనలు
ఈ చట్టం ప్రకారం SC, ST, OBC, మైనారిటీ విద్యార్థులపై ఏవైనా వివక్ష చూపితే నేరంగా పరిగణించి, నాన్బెయిలబుల్ కేసు నమోదు చేస్తారు. తొలిసారి నేరానికి పాల్పడితే ఏడాది వరకు జైలు శిక్షతో పాటు Rs.10,000 జరిమానా విధించవచ్చు. బాధిత విద్యార్థికి లక్ష రూపాయల వరకు నష్ట పరిహారం చెల్లించేలా కోర్టు నేరస్తుడిని ఆదేశించవచ్చు. అదే నేరం మళ్లీ చేస్తే శిక్ష మరింత తీవ్రంగా ఉంటుంది. మూడేళ్లు జైలు శిక్షతో పాటు రూ. 1 లక్ష జరిమానా విధించే అవకాశం ఉంది.
విద్యా సంస్థలపై కూడా కఠిన చర్యలు
కేవలం వ్యక్తులకే కాకుండా, విద్యా సంస్థలు వివక్షకు పాల్పడినట్టుగా నిరూపితమైతే, ఆ సంస్థలపై కూడా చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా ప్రభుత్వ గ్రాంట్లు ఆపివేసే నిబంధన ఈ చట్టంలో ఉంది. ఇది విద్యా వ్యవస్థలో సమానత్వాన్ని స్థిరపరచడానికే కాక, విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంచే దిశగా కీలక అడుగుగా భావించబడుతోంది. రోహిత్ వేముల చట్టం (Rohith Vemula Act) అమలులోకి వస్తే, భవిష్యత్తులో విద్యా రంగంలో అసమానతలకు గట్టి అడ్డుకట్ట పడే అవకాశముంది.
Read Also : Hindi Language : హిందీ భాషపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు