అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల చేసిన వ్యాఖ్యలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) స్పందించారు. ట్రంప్ స్నేహపూర్వక భావనలను గౌరవిస్తానని, వాటికి కట్టుబడి ఉంటానని మోదీ స్పష్టం చేశారు. భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.అధ్యక్షుడు ట్రంప్ మా సంబంధాలపై చేసిన సానుకూల వ్యాఖ్యలను, ఆయన చూపిన స్నేహభావాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. భారత్-అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలంగా ఉంది. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుతుంది అని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా రాశారు.
ట్రంప్ తాజా వ్యాఖ్యలు
ఇంతకుముందు ట్రంప్ మాట్లాడుతూ మోదీ ఎప్పటికీ తన స్నేహితుడేనని అన్నారు. అమెరికా-భారత్ మధ్య ప్రత్యేక బంధం ఉందని గుర్తుచేశారు. అయితే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మోదీ గొప్ప నాయకుడు. మా బంధం ఎప్పటికీ బలంగానే ఉంటుంది. కానీ ఆయన చేస్తున్న కొన్ని నిర్ణయాలు నాకు నచ్చడం లేదు. అయినా ఇది పెద్ద సమస్య కాదని భావిస్తున్నాను అని ట్రంప్ పేర్కొన్నారు.రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా భారత్పై అధిక సుంకాలు విధించింది. తాజా జాబితా ప్రకారం, బ్రెజిల్ తర్వాత భారత ఎగుమతులపైనే అమెరికా 50 శాతం కంటే ఎక్కువ టారిఫ్లు అమలు చేసింది. ఈ చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇది అన్యాయమని, అహేతుకమని పేర్కొంది.
చైనాలో మోదీ చురుకైన పాత్ర
ఈ పరిణామాల మధ్యే ప్రధాని మోదీ చైనాలోని టియాంజిన్లో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొన్నారు. అక్కడ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లతో మోదీ సన్నిహితంగా మెలిగారు. వారితో కరచాలనం, ఆలింగనం చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అమెరికాతో ఉన్న ఉద్రిక్తతల మధ్య మోదీ రష్యా-చైనా నేతలతో స్నేహపూర్వక బంధాన్ని ప్రదర్శించారు.
ట్రంప్ వివరణ
కొన్ని రోజుల క్రితం ట్రంప్ అమెరికా భారత్ను చైనాకు కోల్పోయింది అని విచారం వ్యక్తం చేశారు. అయితే ఆ తర్వాత తన వ్యాఖ్యలను సరిదిద్దుకున్నారు. “భారత్ రష్యా నుంచి అధిక మొత్తంలో చమురు కొనుగోలు చేయడం నిరాశ కలిగించింది. అందుకే అధిక సుంకాలు విధించాం. అయినా మోదీతో నాకు సత్సంబంధాలే ఉన్నాయి” అని ఆయన వివరించారు.మోదీ-ట్రంప్ మధ్య ఉన్న బంధం మళ్లీ చర్చకు వస్తోంది. స్నేహపూర్వక భావనల మధ్య అప్పుడప్పుడు వివాదాలు తలెత్తుతున్నా, ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం బలంగా ఉందని ఇరువురి వ్యాఖ్యలతో స్పష్టమైంది.
Read Also :