పన్నా టైగర్ రిజర్వ్కు చిరస్మరణీయ గుర్తుగా నిలిచిన వత్సల అనే ఆడ ఏనుగు (elephant death) తన శతాబ్దపు జీవనయానాన్ని ముగించింది. వయోవృద్ధతతోపాటు అవయవాలు పని చేయకపోవడంతో మంగళవారం తుదిశ్వాస విడిచిందని అటవీ శాఖ వెల్లడించింది. ఆసియాలో అత్యంత వృద్ధ ఆడ ఏనుగు (The oldest female elephant in Asia) గా గుర్తింపు పొందిన వత్సల మరణంతో పీటీఆర్ సిబ్బందిలో విషాదం నెలకొంది.‘దాదీ మా’గా పిలిచే వత్సల పన్నా అడవుల్లో అందరి మనసు దోచింది. అనారోగ్యంతో బాధపడుతూ హినౌతా క్యాంపులో పశువైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ మరణించింది. వత్సల మృతిచెందిన విషయం తెలియగానే ఫీల్డ్ డైరెక్టర్ అంజనా సుచితా టిర్కీ, డిప్యూటీ డైరెక్టర్ మోహిత్ సూద్, వైద్యుడు సంజీవ్ గుప్తా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం క్యాంపులో గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు.

కేరళ నుంచి పన్నా వరకు శతాబ్ద ప్రయాణం
వత్సల జీవన ప్రయాణం నీలంబూర్ అడవుల్లో మొదలైంది. కలప రవాణా కోసం పనిచేసిన వత్సల, 1971లో మధ్యప్రదేశ్ హోషంగాబాద్కు తరలించబడింది. 1993లో పన్నా టైగర్ రిజర్వ్కు చేరిన వత్సల అక్కడ వన్యప్రాణి సంరక్షణలో కీలక పాత్ర పోషించింది. పులుల జాడలు గుర్తించడంలో విశేష సేవలు అందించింది. చివరి దశలో పుట్టిన ఏనుగు పిల్లలకు తల్లిలా మమకారాన్ని పంచింది.
పన్నా ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన వత్సల
వత్సల మరణాన్ని పన్నా ఎంపీ బ్రీజేంద్ర ప్రతాప్ సింగ్ ‘భావోద్వేగపూరితమైన సమయం’గా వర్ణించారు. వత్సల జీవితానికి నివాళులర్పిస్తూ పర్యాటకులు సోషల్ మీడియా వేదికగా తమ జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. వత్సల జ్ఞాపకం పీటీఆర్ సిబ్బందికి, పర్యాటకులకు శాశ్వతంగా మిగిలిపోతుంది.
Read Also : Bharat Bandh : నేడు భారత్ బంద్.. ఈ రంగాలపై ప్రభావం!