ఒడిశాకు చెందిన ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పాట్నాయక్ ‘ఆపరేషన్ సిందూర్’పై తాను రూపొందించిన అద్భుత శిల్పంతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. పూరీ తీరాన ఆరు అడుగుల ఎత్తులో రూపొందించిన ఈ సైకత శిల్పంలో, భరతమాత నుదుటిపై ఉన్న సింధూరం శక్తిగా మారి శత్రువుల్ని ఎలా వినాశనం చేసిందో ప్రతిబింబించారు.“భారత్ మాతా కీ జై.. న్యాయం లభించింది” అనే శీర్షికతో పాట్నాయక్ ఈ శిల్ప వీడియోను తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నెటిజన్లు తనదైన శైలిలో స్పందిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇది అకస్మాత్తుగా వచ్చిన స్పందన కాదు. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.

ఈ దారుణానికి ప్రతీకారం తీర్చేందుకు భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టి బుధవారం ఉదయం పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)తో పాటు పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపింది.జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ప్రధాన ఉగ్రవాద సంస్థలకు చెందిన తొమ్మిది ఉగ్ర శిబిరాలను ఈ దాడిలో నేలమట్టం చేసింది. ఈ ఆపరేషన్ ఫలితంగా దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం అఖిలపక్ష సమావేశంలో వెల్లడించారు.భారత భద్రతా దళాల దూకుడు, దేశం తీసుకున్న చొరవపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్న తరుణంలో, సుదర్శన్ పాట్నాయక్ రూపొందించిన ఈ శిల్పం దేశ భక్తిని ప్రతిబింబిస్తూ అందరి మనసులను ఆకట్టుకుంటోంది. ఆయన కళ మరోసారి దేశం పట్ల అంకితభావాన్ని ప్రతిభాటిస్తూ పాజిటివ్ సందేశాన్ని వెలిబుచ్చుతోంది.
Read Also : Operation Sindoor : పాక్ జెండాలు పీకేస్తోన్న బలోచ్ వాసులు..ఎందుకంటే!