పహల్గామ్ సమీపంలో అమాయక పౌరులపై ఉగ్రవాదులు జరిపిన దారుణ దాడికి ప్రతిగా, భారత్ మేజర్ స్థాయిలో ప్రత్యుత్తర చర్యలు చేపట్టింది. ఈ ప్రతీకార చర్యకు ‘ఆపరేషన్ సిందూర్’ అనే పేరును పెట్టారు. ఈ ఆపరేషన్ పాకిస్థాన్ ప్రేరిత ఉగ్రవాద సంస్థలకు గట్టి హెచ్చరికగా నిలిచేలా ఉద్దేశించబడింది. ఇప్పటికే ఈ చర్యల్ని తాలూకు వివరాలను వెల్లడించేందుకు ఈ రోజు ఉదయం 10:30 గంటలకు భారత సైన్యం మీడియా సమావేశం నిర్వహించనుంది. సరిహద్దులో జరిగిన పరిణామాలను వివరించనున్నారు.
భారత భద్రతా వ్యవస్థ అప్రమత్తం
శుక్రవారం భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్లలో పాకిస్థాన్ పలు క్షిపణి, డ్రోన్ దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. జమ్మూలోని ఆర్ఎస్ పురా, అర్నియా, సాంబా, హీరానగర్తో పాటు రాజస్థాన్లోని జైసల్మేర్లో కూడా పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, భారత వైమానిక రక్షణ వ్యవస్థలు, ముఖ్యంగా ఎస్-400 క్షిపణి వ్యవస్థ ఈ దాడులను సమర్థవంతంగా అడ్డుకుని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా నివారించాయి.
భారత సైన్యం బలమైన ప్రతీకారం – పాక్ సైనిక స్థావరాలపై దాడులు
ఈ దాడులకు తక్షణ ప్రతిగా భారత్ పాకిస్థాన్ అంతర్భాగంలోకి చొచ్చుకెళ్లి ప్రధాన సైనిక మౌలిక సదుపాయాలపై దాడులు జరిపింది. ముఖ్యంగా లాహోర్లోని పాకిస్థాన్ సైనిక మౌలిక సదుపాయాలు, వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు సమాచారం. సర్ఘోదా వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన పాకిస్థాన్కు చెందిన ఎఫ్-16, జెఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలను భారత దళాలు కూల్చివేసినట్లు పేర్కొన్నాయి. అంతేకాకుండా, గురువారం రాత్రి జమ్మూ, పఠాన్కోట్, ఉధంపూర్లోని భారత సైనిక స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసేందుకు పాకిస్థాన్ చేసిన ప్రయత్నాలను కూడా భారత్ తిప్పికొట్టింది. ఈ క్రమంలో 50కి పైగా పాకిస్థాన్ డ్రోన్లను నిర్వీర్యం చేసినట్లు భారత సైనిక వర్గాలు తెలిపాయి.
రక్షణ మంత్రితో అత్యవసర భేటీలు
ఈ ఉదయం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం సౌత్ బ్లాక్ లో జరగనున్నది. సైనిక స్థాయిలో జరిగిన ప్రతీకార చర్యలపై మంత్రిత్వ శాఖ సమీక్ష చేపట్టనుంది. ప్రస్తుతం సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత సైన్యం నిర్వహించబోయే మీడియా సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ‘ఆపరేషన్ సిందూర్’కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ సమావేశంలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
read also: Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ వేళ బ్యాంకులకు కేంద్ర ఆర్దిక మంత్రి కీలక ఆదేశాలు